ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నది
రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం కాంగ్రెస్ పేటెంట్: భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు : ప్రజలను, రైతులను బీఆర్ఎస్ పార్టీ కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నదని, అది బీఆర్ఎస్కు వెన్నతో పెట్టిన విద్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారాన్ని రైతులు, ప్రజలు నమ్మొద్దని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ‘‘ఉచిత కరెంట్ గురించి ఎవరు ఆలోచన చేయని రోజుల్లోనే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం కాంగ్రెస్ పేటెంట్. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర నిధులు ఉన్న సమయంలోనే వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది”అని పేర్కొన్నారు.