నల్గొండపై కేసీఆర్​ ఫోకస్

నల్గొండపై కేసీఆర్​ ఫోకస్
  • లోకల్ ఎమ్మెల్యేను కాదని నేరుగా సీఎంవో  నుంచి మానిటరింగ్
  • వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం
  • దక్షిణ తెలంగాణలో పార్టీ ఊపుతెచ్చేందుకేననే చర్చ

నల్గొండ, వెలుగు :  గత ఎన్నికల ముందు నల్గొండ  పట్టణాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్​ రెండేండ్లుగా ఇక్కడి అభివృద్ధి పనులపై స్పెషల్​ఫోకస్​ పెట్టారు.  ఎక్కడా లేనివిధంగా సుమారు రూ.1,300 కోట్ల విలువైన పనులకు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వగా, ఇప్పటికే  సుమారు రూ.300 కోట్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ పనులన్నింటినీ లోకల్​ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సీఎంవో నుంచి నేరుగా మానిటరింగ్ చేస్తుండడం ఆసక్తిరేపుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​లో పార్టీ పరిస్థితి బాగాలేకపోవడంతో పాటు కాంగ్రెస్​ కంచుకోటలుగా భావిస్తున్న నల్గొండ, ఖమ్మం, మహబూబ్​నగర్​జిల్లాల్లో బీఆర్ఎస్​కు ఊపుతేవడమే లక్ష్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

డెవలప్​మెంట్​వర్క్స్​పై  సీఎంవో  మానిటరింగ్​.. 

2018 ఎన్నికల టైంలో  నల్గొండ పట్టణాన్ని సీఎం కేసీఆర్​దత్తత తీసుకున్నప్పటికీ  రెండేళ్ల నుంచే ఇక్కడ అభివృద్ధి పనుల పై స్పెషల్​ఫోకస్​ పెట్టారు. రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్​ తర్వాత ఆ స్థాయిలో నల్గొండలో సుమారు రూ.1,300 కోట్ల విలువైన పనులకు కేసీఆర్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. దీంట్లో ఇప్పటికే సుమారు రూ.300 కోట్ల పనులు తుదిదశకు చేరాయి. లోకల్​ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఈ పనులను నేరుగా సీఎంవో నుంచి మానిటరింగ్​ చేస్తున్నారు.  నల్గొండలో ఐటీ పార్కు, మార్కెట్లు, రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి  కేటీఆర్ కూడా పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒకటి, రెండు నెలల్లో పనులు పూర్తయితే  ఓపెనింగ్​కు  సీఎం కేసీఆర్​ వచ్చే చాన్స్​ ఉందని లోకల్​ లీడర్లు చెప్తున్నారు. అంతకు ముందు ఈ నెలాఖరులో మంత్రి కేటీఆర్​ పర్యటన కూడా  ఉంటుందని, ఈ సందర్భంగా  మిగిలిన వెయ్యి కోట్ల పనులకు కే టీఆర్​శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నారు.

దక్షిణ తెలంగాణలో  బీఆర్​ఎస్​ బలహీనం..

నల్గొండ, మహబూబ్​నగర్​, ఖమ్మం జిల్లాల్లో బీఆర్​ఎస్ బలహీన పడినట్లు అధికార పార్టీ సర్వేలు చెప్తున్నాయి. ఈ మూడు జిల్లాల్లో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా బీఆర్​ఎస్ దే పైచేయి కనిపిస్తున్నప్పటికీ  ఖమ్మం, మహబూబ్​నగర్​ జిల్లాల్లో ఇటీవల జరిగిన పరిణామాలు రూలింగ్​పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. సీనియర్లు పొంగులేటి, జూపల్లి, వాళ్ల అనుచరులు బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో ఉప్పు, నిప్పులా ఉండే సీనియర్లంతా ఏకతాటి పైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కలిసి అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో మెజారిటీ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పలువురి పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణపై ఫోకస్​ పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాను నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే మూడు ఉమ్మడి జిల్లాల్లో  బీఆర్ఎస్​పార్టీకి ఊపుతేవడంతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని కేసీఆర్​ఆలోచిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.