కేంద్రంతో మళ్లా వడ్ల కొట్లాట

కేంద్రంతో మళ్లా వడ్ల కొట్లాట

 

  • ధర్నాలు, ఆందోళనలు చేద్దాం
  • మంత్రులతో సీఎం కేసీఆర్​
  • ఫాంహౌస్‌‌లో ఎమర్జెన్సీ మీటింగ్‌‌.. హాజరైన ప్రశాంత్​ కిశోర్
  • యాసంగి సాగు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ.. రేపు టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీ భేటీ

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ వడ్ల కొట్లాటకు సీఎం కేసీఆర్​ సిద్ధమయ్యారు. యాసంగి వడ్లను తాము కొనేది లేదని, కేంద్రమే కొనాలని తేల్చిచెప్పారు. ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్‌‌లో శనివారం  మంత్రులు, అధికారులతో కేసీఆర్​ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌‌ కిశోర్‌‌ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత యువతలో స్పందన ఎట్లా ఉంది అనే అంశాలతో పాటు యాసంగిలో వడ్ల కొనుగోళ్లపైనా చర్చించినట్టు తెలిసింది. యాసంగి సీజన్‌‌లో వడ్ల కొనుగోళ్లపై చర్చించేందుకు సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌‌లో కేసీఆర్‌‌ అధ్యక్షతన టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీ జాయింట్‌‌ మీటింగ్‌‌ నిర్వహించనున్నారు. మంత్రులతో సమావేశం అనంతరం ఈమేరకు సీఎంవో నుంచి ప్రకటన విడుదలైంది. ఎల్పీ జాయింట్​ మీటింగ్​కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్​పర్సన్లు,  రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్​పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌‌ అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్‌‌ ఆదేశించారు. రాష్ట్రంలో పండిన యాసంగి వడ్లను కేంద్రమే కచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ ధర్నా, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

వానాకాలం సీజన్‌‌‌‌లోనూ వడ్ల కొనుగోళ్లపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఇదే తరహా పోరాటాలు చేసింది. అప్పుడు ఇందిరాపార్క్‌‌‌‌లో నిర్వహించిన ధర్నాకు సీఎం కేసీఆర్‌‌‌‌ హాజరయ్యారు. రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీలు పార్లమెంట్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ హాల్‌‌‌‌లో  నిరసన తెలిపారు. రాష్ట్రం నుంచి ఐదుగురు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. వానాకాలంలో రాష్ట్రం నుంచి 40 లక్షల టన్నులకు తోడు అదనంగా 5 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం ఓకే చెప్పింది.

రైతుల నుంచి వ్యతిరేకత ఎదురుకావొద్దనే..?

యాసంగిలో వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌‌‌‌, వ్యవసాయ మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డి సహా మొత్తం కేబినెట్‌‌‌‌, ఎమ్మెల్యేలు, అధికారులు, వ్యవసాయ శాఖ పదే పదే రైతులను హెచ్చరించారు. కేంద్రం బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ కొనుగోలు చేయబోమని చెప్తున్నదని, కాబట్టి వరి సాగు వద్దే వద్దని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ సహా ఆ పార్టీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిప్పికొట్టారు. రా రైస్‌‌‌‌ ఎంత ఇచ్చినా కేంద్రం కొంటామని తేల్చిచెప్పిందన్నారు. పీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్‌‌‌‌ రెడ్డి కూడా యాసంగిలో రైతులు వరి సాగు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొనదో చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఇప్పటికే ‘మన ఊరు - మన పోరు’ నినాదంతో సభలు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర సర్కారు తీరును బీజేపీ ఎండగడుతున్నది. తమ పొలాల్లో వడ్లు తప్ప వేరే పంట పండదని కొందరు రైతులు.. ఇతర పంటలు వేస్తే గిట్టుబాటు కాదని ఇంకొందరు రైతులు యాసంగిలో వరిని సాగు చేశారు. ఇట్లా యాసంగి సీజన్‌‌‌‌లో  36 లక్షల ఎకరాల్లో వరిసాగవుతున్నది.  83 లక్షల టన్నుల బియ్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. పంటలు చేతికి వస్తుండటంతో ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు రాష్ట్ర సర్కారుపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై యుద్ధానికి దిగుతున్నట్టు ప్రకటించింది. దానిపై వ్యూహ రచన కోసం టీఆర్​ఎస్​ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

నిరుటి కోటానే పూర్తిగా ఇవ్వలే

యాసంగిలో వడ్ల కొనుగోళ్లపై కేంద్రంతో పోరాటానికి సై అంటున్న రాష్ట్ర సర్కారు నిరుడు యాసంగి కోటా వడ్లనే ఇప్పటికీ ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వలేదు. యాసంగి కోటాలో 6.63 లక్షల టన్నుల రా రైస్‌‌‌‌ ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉండగా.. అందులో 5.46 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌‌‌‌ రైస్‌‌‌‌ ఇస్తామని ఇటీవలే లేఖ రాసింది. నిరుడు యాసంగిలో 92.34 లక్షల టన్నుల వడ్లు సేకరించగా.. 62.53 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. ఇందులో 17.38 లక్షల టన్నులు రా రైస్‌‌‌‌ కాగా, 44.75 లక్షల టన్నుల బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌. ఎఫ్‌‌‌‌సీఐతో అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్న మేరకు రా రైస్‌‌‌‌ ఇవ్వలేదు. దీనిపై పలుమార్లు కేంద్రం లేఖలు రాసింది.  అంతస్థాయిలో రా రైస్‌‌‌‌ ఇవ్వలేమని, దానికి బదులుగా ఫోర్టిఫైడ్‌‌‌‌ రైస్‌‌‌‌ ఇస్తామని రాష్ట్ర సివిల్‌‌‌‌ సప్లయీస్‌‌‌‌ లేఖ రాయడంతో దానికి ఎఫ్‌‌‌‌సీఐ అంగీకారం తెలిపింది. ఈ మేరకు బియ్యం రాష్ట్రం నుంచి ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. నిరుటి బియ్యమే కేంద్రానికి పూర్తిగా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వడ్ల కొనుగోలు పేరుతో ఆందోళనలకు సిద్ధమవుతున్నది. 

మంత్రుల భేటీలో పీకే

సీఎం కేసీఆర్​ ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్‌‌‌‌ నుంచి మంత్రులకు ఉదయం ఫోన్‌‌‌‌ చేసి అర్జెంట్​గా రావాలని పిలిపించుకున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఉన్న హరీశ్‌‌‌‌రావు అప్పటికప్పుడు వాటిని రద్దు చేసుకొని ఫాంహౌస్‌‌‌‌కు చేరుకున్నారు. మిగతా మంత్రులు మధ్యాహ్నం 12 గంటలలోపే ఫాంహౌస్‌‌‌‌కు వచ్చారు. మంత్రులు, సీఎస్‌‌‌‌ సోమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌తో పాటు వివిధ శాఖల హెచ్‌‌‌‌వోడీలతో సీఎం సమావేశమయ్యారు. సుమారు నాలుగున్న గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం అధికారులు హైదరాబాద్‌‌‌‌కు వచ్చేయగా మంత్రులతో కేసీఆర్‌‌‌‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌‌‌‌ కిశోర్‌‌‌‌ కూడా పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న అంశాలతో పాటు ప్రజలు ఆగ్రహంతో ఉన్న అంశాలపైనా ఆయన ఫీడ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ ఇచ్చినట్టు సమాచారం. ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రకటన తర్వాత యువత ఏమనుకుంటున్నారు.. ఇతర రాజకీయ అంశాలపైనా తన సర్వేలో తేలిన అంశాలపై పీకే చర్చించినట్టు తెలిసింది. మంత్రులతో సీఎం సమావేశం కొనసాగుతుండగానే 21న టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎల్పీ భేటీ, ఢిల్లీకి సీఎం సహా మంత్రులు వెళ్తారని సీఎంవో నుంచి ప్రెస్‌‌‌‌ నోట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేశారు. కేంద్రంపై పోరు, రాష్ట్రంలో బీజేపీని నిలువరించడం సహా అనేక అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. సమావేశంలో అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌‌‌‌, మహారాష్ట్ర టూర్‌‌‌‌లో ఉన్న నిరంజన్‌‌‌‌ రెడ్డి, ఖమ్మంలో ఉన్న పువ్వాడ అజయ్‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌ జిల్లా పర్యటనలో ఉన్న సత్యవతి రాథోడ్‌‌‌‌ ఈ సమావేశానికి హాజరుకాలేదు. మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్‌‌‌‌లోనే ఉన్నప్పటికీ ఆయనను ఈ సమావేశానికి ఆహ్వానించలేదని తెలిసింది.