హైదరాబాద్ పట్ల జస్టిస్ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు.సుదీర్ఘకాలం ఇక్కడ పనిచేసినందున ఆయనకు అన్ని విషయాలు తెలుసున్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి లేఖ రాశానని కేసీఆర్ గుర్తు చేశారు. అయితే ఆ అంశం పెండింగ్లో పెట్టారని చెప్పారు. అయితే సీజేఐ రమణ చొరవతో హైకోర్టు బెంచీలను 24 నుంచి 42కు పెంచారన్నారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరపున జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అంతేకాదు దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఉండటం గర్వకారణమన్నారు.ఆయన ఆశీస్సులు, మద్దతు ఎల్లవేళలా ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
న్యాయ వ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులలో పనిభారం ఉందని తెలిసిందన్నారు. 23 జిల్లాల్లో జిల్లా కోర్టు భవనాలు చేపడతామని వెల్లడించారు.
చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. విద్యుత్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని,వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు.పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అని చెప్పారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో జరుగుతున్న న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
మరిన్ని వార్తల కోసం