ధరణికి దన్నుగా..దొరల భూదోపిడీ

ధరణికి దన్నుగా..దొరల భూదోపిడీ
  • కల్వకుంట్ల ఫ్యామిలీ దోచిందే ఎక్కువ
  • వాళ్ల ఫ్యామిలీ, సన్నిహితులకు 440 ఎకరాల సంతర్పణ
  • హరీశ్, కవిత, కేటీఆర్ అందరూ పట్టాలు చేసుకున్రు
  • విదేశాల్లో సర్వర్లు పెట్టి భూములు చెర బట్టిన్రు
  • ఇనాం భూములను మార్చుకున్న జగదీశ్ రెడ్డి
  • బుల్లెట్ ట్రైన్ భూముల్లో ఎర్రబెల్లి, సుధీర్ రెడ్డి , గంగుల పాగా
  • అసెంబ్లీలో లెక్కలు బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌‌‌‌ను అడ్డం పెట్టుకొని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌‌‌‌రావు కుటుంబం వేల కోట్ల  ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, వందలాది ఎకరాల భూములను చెరబట్టిందని సీఎం  రేవంత్‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఒక్క కేసీఆర్‌‌‌‌ కుటుంబమే ఏకంగా 440 ఎకరాలు  పోగేసుకుందని,  ల్యాండ్‌‌‌‌ సీలింగ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ పరిమితులను కాలరాశారని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.  బుధవారం శాసనసభలో 22ఏపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అగ్రనేతల భూ అక్రమాల గుట్టు రట్టు చేశారు. 

కేసీఆర్​ కుటుంబసభ్యులతోపాటు వారి తోడల్లుళ్లు, మేనల్లుళ్లు, ఇతర బంధుగణం, అనుచరులు, బీఆర్ఎస్​ నేతల పేరిట రాష్ట్రవ్యాప్తంగా సాగిన భూదోపిడీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ వేల ఎకరాల్లో ఉంటుందని ఆధారాలతోసహా వివరించారు. ఆయా భూముల రికార్డులను సర్వే నంబర్లతో సహా సభ ముందు ఉంచారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని,  వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని  ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆయా భూములపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్‌‌‌‌ ఆడిట్, సమగ్ర విచారణ జరిపించి కబ్జాదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. 

‘‘ప్రపంచ చరిత్రలో లేదా తెలంగాణ గడ్డపై ప్రజల హక్కుల కోసం పోరాడిన యోధులు ఎవరైనా ఆస్తులు సంపాదించుకున్నారా? అంతర్జాతీయ విప్లవకారుడు చే గువేరా నుంచి మొదలుపెడితే నేల కోసం పోరాడిన కుమ్రం భీం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ పట్టిన కమ్యూనిస్టు వీరులు, గద్దర్, అందెశ్రీ, రావి నారాయణరెడ్డి, బద్దం నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ధర్మభిక్షంలాంటి మహనీయులు తమ సర్వస్వాన్ని, కుటుంబాలను, ఆస్తులను త్యాగం చేశారు తప్ప ఏనాడూ ఒక్క ఇంచు భూమి సంపాదించలేదు. కానీ తెలంగాణ తెచ్చామని డబ్బా కొట్టుకునే కేసీఆర్​ మాత్రం ఉద్యమం ముసుగులో వేల కోట్లు, వందల ఎకరాల భూములను దోచుకున్నారు” అని మండిపడ్డారు.  

కేసీఆర్, ఆయన భార్య పేరిట 67.5 ఎకరాలు 

ల్యాండ్‌‌‌‌ సీలింగ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ను తుంగలో తొక్కుతూ కేసీఆర్​ ఫ్యామిలీ వందల ఎకరాల భూములను చెరబట్టిందని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఆరోపించారు. చట్ట ప్రకారం భార్య, భర్త, మైనర్‌‌‌‌ లేదా అవివాహిత పిల్లలను ఒక యూనిట్‌‌‌‌గా పరిగణిస్తారని,  నిబంధనల మేరకు ఒక కుటుంబానికి గరిష్టంగా 27 ఎకరాల తరి లేదా 54 ఎకరాల మెట్ట  మాత్రమే ఉండాలని అన్నారు. కానీ మాజీ సీఎం కేసీఆర్​, ఆయన సతీమణి శోభ పేరిట సిద్దిపేట అర్బన్, మర్కూక్‌‌‌‌ మండలాల్లోని మూడు గ్రామాల్లో  ఏకంగా 67.5 ఎకరాల తరి భూమి ఉందని సీఎం వెల్లడించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పాలకులే స్వయంగా తుంగలో తొక్కి భూదాహం ప్రదర్శించారని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

హరీశ్​ కుటుంబానికి 30.5, కవిత ఫ్యామిలీకి 37.26 ఎకరాలు 

కేసీఆర్‌‌‌‌ కుటుంబంతోపాటు వారి ఫ్యామిలీ పేరిట రాష్ట్రవ్యాప్తంగా భూదోపిడీ సాగిందని సీఎం రేవంత్​ ఎండగట్టారు. మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు, ఆయన భార్య తన్నీరు శ్రీనిత పేర్లపై చిన్నకోడూరు, మహేశ్వరం, సిద్దిపేట, మొయినాబాద్‌‌‌‌లలో కలిపి 30.5 ఎకరాలు ఉన్నాయని, ఇందులో హరీశ్‌‌‌‌ పేరిట 21 ఎకరాలు, శ్రీనిత పేరిట 8.5 ఎకరాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, కేసీఆర్‌‌‌‌ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరిట మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో 14 ఎకరాలు, ఆమె భర్త  డీఆర్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌ పేరిట 23 ఎకరాలు కలిపి 37.26 ఎకరాల భూమి నమోదై ఉందని వివరించారు. ఇక కేసీఆర్‌‌‌‌కు మందులు ఇస్తుంటానని స్వయంగా రాజ్యసభ సీటు ఇప్పించుకున్న జోగినపల్లి సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌ కుటుంబం భూబాగోతం మరింత విస్మయం కలిగిస్తోందని  సీఎం చెప్పారు.
 
సంతోష్‌‌ తండ్రి జోగినపల్లి రవీందర్‌‌‌‌రావు పేరిట ఎర్రవల్లి, కేశంపేట, మార్కూక్, నరసింహాపూర్, పెద్దూర్, తడగొండ, వేములవాడలో 53.16 ఎకరాలు, సంతోష్‌‌ కుమార్‌‌ పేరిట మార్కూక్, పెద్దేముల్, ఎర్రవల్లి, తోటపల్లిలో 18.21 ఎకరాలు, ఆయన భార్య రోహిణి పేరిట రంగారెడ్డి జిల్లాలో 7.23 ఎకరాలు కలిపి ఈ ఒక్క కుటుంబానికే 79.20 ఎకరాల భూమి ఉందని వివరించారు. వీరికి తోడు బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీ నవీన్‌‌రావు పేరిట 52.16 ఎకరాలు, ఆయన సోదరుడు కొండల్‌‌రావు పేరిట 48.38 ఎకరాలు ఉన్నాయని, ఇలా కేసీఆర్‌‌ ఉమ్మడి కుటుంబం తొమ్మిది జిల్లాల్లోని 24 మండలాల పరిధిలో గల 31 గ్రామాల్లో ఏకంగా 440 ఎకరాల భూములను అధికార బలంతో సొంతం చేసుకుందని వెల్లడించారు.