
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఓయూ పీఎస్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్లో ఆయన కోరారు. అనుమతి లేకుండా ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారనే ఫిర్యాదుపై 2016లో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు.
రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదు అయింది. విచారణ పూర్తి చేసి అభియోగ పత్రం కూడా పోలీసుల దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఎంపీగా ఉన్న టైంలో రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి( 2016)లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆధారాల్లేకుండా ఆరోపణలతో ఫిర్యాదు చేశారని తప్పుబట్టింది. ఘటనా స్థలంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు ఆధారాల్లేవని పేర్కొన్నది. 2016లో ఓ భూ వివాదానికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కొట్టేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటివేశారు. దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం తీర్పు చెప్పారు.
గోపన్నపల్లిలో 31 ఎకరాలకు హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, రేవంత్రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, ఎ.లక్ష్మయ్య మధ్య వివాదం ఉన్నది. ఎంపీగా ఉన్న రేవంత్ అండతోనే సొసైటీ స్థలంలోకి అక్రమంగా చొరబడ్డారని, ఎస్సీ కులం పేరుతో దూషించారని సొసైటీకి చెందిన ఎన్.పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.