
- కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలైతయ్
- బీఆర్ఎస్ను ప్రజలు బొందపెట్టిన్రు.. ఇక దించాల్సింది మోదీనే
- కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే..
- మోదీ 100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని దివాలా తీయించిండు
- బిల్లా, రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అంటలేరు
- కోదండరామ్ను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో అడ్డుకుంటరా?
- డీవోపీటీ కేంద్రం చేతుల్లోనే ఉంది.. అవినీతి ఐఏఎస్,
- ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటే మేం స్వాగతిస్తం
- ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్, మోదీ ఒక్కటేనని.. వాళ్లిద్దరూ చీకటి దోస్తులు అని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రజలకు బూటకపు హామీలు ఇవ్వడంలో, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో ఇద్దరిదీ ఒకటే స్టైల్. అప్పులు చేసి ప్రజల నెత్తిన మోపడంలోనూ ఇద్దరిదీ ఒకటే దారి” అని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను చీకటి దోస్తులు నిలువునా ముంచేశారన్నారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే, మోదీ రూ.100 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని దివాలా తీయించారని అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు కేసీఆర్, మోదీ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లో పండుకుని, చీకట్లో మోదీతో మంతనాలు జరుపుతున్నారు. అందుకే బిల్లా, రంగాలు (కేటీఆర్, హరీశ్రావు) బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. కాంగ్రెస్పై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ను నిలువరించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నది వాళ్ల చీకటి ఒప్పందం” అని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఇప్పటికే ప్రజలు బొంద పెట్టారని, ఇప్పుడు మోదీని దించేయాల్సిన సమయం వచ్చిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో వాళ్లిద్దరినీ కలిపి ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని ‘విభజించు.. పాలించు’ అనే విధానంతో బీజేపీ ముందుకెళ్తున్నదని మండిపడ్డారు. ‘‘ప్రతి వ్యక్తి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ.. చిల్లిగవ్వ కూడా పేదలకు ఇవ్వలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి.. కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు” అని ఫైర్ అయ్యారు. ప్రపంచంలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు మన దేశంలోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కోదండరాం గొప్పతనం అందరికీ తెలుసు..
విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తోందని రేవంత్ ఆరోపించారు. మణిపూర్లో గొడవలు జరిగి లక్షలాది మంది నిరాశ్రయులైనా అక్కడికి ప్రధాని మోదీ వెళ్లలేదని ఫైర్ అయ్యారు. దేశంలో ప్రజలకు రక్షణ దొరకాలన్నా, ప్రజాస్వామ్యం నిలబడాలన్న కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘దేశ సమైక్యతను కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారు. దేశానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలవాలి” అని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు అమలవుతాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను జనం ఎప్పుడో బొంద పెట్టారని.. ఇక దించాల్సింది, ఓడించాల్సింది మోదీనే అని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారు. అది అవివేకానికి, పిచ్చి వాగుడుకు నిదర్శనం. మోదీని దించేందుకు రాహుల్ యాత్ర చేస్తుంటే, ఆ పార్టీతో మేం కలిశామనడం వారి అవివేకం. ఓటమితో మతిస్థిమితం కోల్పోయి.. బిల్లా, రంగాలు ఉనికిని కాపాడుకునేందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు” అని ఫైర్ అయ్యారు. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో బీఆర్ఎస్ అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. ‘‘కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటేనే, వాళ్ల భావ దారిద్ర్యం ఏంటో అర్థం చేసుకోవాలి. వాళ్ల దొడ్లో చెప్పులు మోసే వారిని కోదండరాంతో ఎలా పోలుస్తారు? ఆయన గొప్పతనం గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం ఉన్నదా?” అని ప్రశ్నించారు. డీవోపీటీ కేంద్రం చేతుల్లోనే ఉందని.. అవినీతి ఐఏఎస్, ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి సోనియా పోటీకి తీర్మానం..
రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ పీఏసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని రేవంత్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల వరకు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.25 వేలు.. మిగతా అన్ని వర్గాలకు రూ.50 వేలు ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభతో మొదలుపెడతామని వెల్లడించారు. ‘‘తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాం. సోనియా మన దగ్గరి నుంచి నామినేషన్ వేస్తే, ఆమె మీద తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారని మేం అనుకోవడం లేదు. ఇక్కడి పార్టీలు కూడా సోనియా మీద అభ్యర్థులను నిలుపకుంటేనే ఆమెను గౌరవించినట్టు అవుతుంది” అని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్పై శ్వేతపత్రం..
తామిచ్చిన హామీల అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని రేవంత్ తెలిపారు. ఇరిగేషన్ శాఖపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ‘‘ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ కోసం సిట్టింగ్ జడ్జీలను కేటాయించాలని చీఫ్ జస్టిస్కు లేఖ రాశాం. ఈ శాఖలో అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే మొదలైంది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చట్ట ప్రకారం విచారణ మొదలుపెట్టాం” అని పేర్కొన్నారు. ‘‘రాజకీయాలను దేవుడితో ముడిపెట్టొద్దు. భద్రాచలంలో రాముడు ఉన్నడు.. భక్తులందరూ వచ్చి దర్శించుకోండి. దేవునికి, రాజకీయానికి సంబంధం లేదు. ఎవరికి వీలైనప్పుడు వెళ్లి వాళ్లు దర్శనం చేసుకుంటారు” అని అన్నారు.
జాతిపితకు సీఎం నివాళి
మెహిదీపట్నం, వెలుగు: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మంగళవారం లంగర్ హౌస్లోని బాపూఘాట్ వద్ద నివాళి అర్పించారు. పలువురు ప్రముఖులు కూడా బాపూఘాట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలు వేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంధాల నుంచి మత పెద్దలు ప్రవచనాలను చదివి వినిపించారు. చిన్నారులు ఆలపించిన బాపూజీ భజన గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీఎస్ శాంత కుమారి, డీజీపీ రవిగుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ పీసీ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్, కేటీఆర్ కూడా నన్ను కలవొచ్చు..
ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఎప్పుడైనా తనను కలవొచ్చునని.. సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చునని రేవంత్ తెలిపారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు.. కేసీఆర్, కేటీఆర్ కూడా ప్రజా సమస్యలపై నన్ను కలవొచ్చు. నేను అందుబాటులో లేకుంటే డిప్యూటీ సీఎం భట్టిని కలవొచ్చు. ప్రజా సమస్యల పరిష్కారానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం” అని చెప్పారు. ‘‘పులి (కేసీఆర్) బయటకు వస్తుందని, ఆయన వస్తే ఏదో జరుగుతుందన్నట్టు బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ అదేం జరగదు. ఆయన బయటకొస్తే బోనులో వేయడానికి ప్రజలు, యువత సిద్ధంగా ఉన్నారు” అని అన్నారు.
ఇచ్చేది.. తెచ్చేది మేమే
తెలంగాణకు మోదీ అన్యాయం చేశారు. పదేండ్లు గడిచినా రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి హామీలను అమలు చేయలేదు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అడగలేదు.. ప్రధానిగా ఉన్న మోదీ ఇయ్యలేదు. ఇక ఇచ్చేది.. తెచ్చేది మేమే.
- సీఎం రేవంత్ రెడ్డి