- 16వ ఆర్థిక సంఘంలోరాష్ట్రానికి ఫండ్స్ పెంచండి
- నీతి ఆయోగ్ టీమ్కుసీఎం రేవంత్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్య, వైద్య రంగాల్లో సౌలతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కుమార్ బేరి బృందం సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి నీతి ఆయోగ్ టీమ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. రాబోయే16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి నిధుల కేటాయింపులు పెరిగేలా చూడాలని సీఎం కోరారు. గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు సహకారం అందించాలన్నారు. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేసే రోడ్ మ్యాప్కు మద్దతు అందించాలని తెలిపారు. నమామి గంగే తరహాలో మూసీ అభివృద్ధికి సాంకేతిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.1800 కోట్ల గ్రాంట్లను కేంద్రం విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్రంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ అఫ్ ట్రాన్స్ ఫర్మేషన్ (ఎస్ఐటీ)ను ఏర్పాటు చేయాలని కోరారు. సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కో-ఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నీతి ఆయోగ్ పాలక మండలిలో తెలంగాణ భాగస్వామ్యం కావాలని..రాష్ట్ర అభివృద్ధికి తమ వంతుగా సహకారమందిస్తామని నీతి ఆయోగ్ తెలిపింది.నీతి ఆయోగ్ కు నిర్మాణాత్మక మద్దతు, సహకారం అందిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు విజయ్ కుమార్, డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, డైరెక్టర్ అభినేశ్ డాష్, ముత్తు కుమార్ , సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.