జీడిమెట్ల, వెలుగు: పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులను పోలీసులు కొట్టిన ఘటన వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు.
వాచ్మన్ ఇచ్చిన తప్పుడు సమాచారంతో పోలీసులు హాస్టల్ గదుల్లోకి వచ్చి తమను అనవసరంగా కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థులు తమపై రాళ్లు రువ్వడంతో పాటు లేడీ వార్డెన్తో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతోనే హాస్టల్లోకి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పోలీసుల దాడిలో తమ పిల్లలు గాయపడ్డారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
