ఆరోగ్య బీమా, ఫిన్టెక్లో ఇన్వెస్ట్ చేస్తాం ..ఎల్ఐసీ ఎండీ దొరై స్వామి
న్యూఢిల్లీ: తాజాగా చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.31,552 కోట్లను సమీకరించామని, ఆరోగ్య బీమా, ఫిన్టెక్లో ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నామని ఎల్ఐసీ ఎండీ, సీఈఓ ఆర్ దొరైస్వామి తెలిపారు. మార్కెట్ అంచనాలను అందుకోవడం, పంపిణీ వ్యవస్థను విస్తరించడం, మార్జిన్లను మెరుగుపరచడంపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎల్ఐసీలో పబ్లిక్ వాటాను 2030 నాటికి 25 శాతానికి పెంచాల్సి ఉంటుందని తెలిపారు.
ఎల్ఐసీ షేర్ ధర, ఐపీఓ ధర కంటే తక్కువగా ఉండటానికి తక్కువ పబ్లిక్ ఫ్లోట్ ఒక కారణమని చెప్పారు. డివిడెండ్ ఈల్డ్ను పెంచడంతో పాటు వన్ ఈజ్ టు వన్ బోనస్ షేర్లను జారీ చేశామని తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల వృద్ధి నెమ్మదించిందని దొరైస్వామి వివరించారు. రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులు కుదుటపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు షేర్లను కొంటుండగా, విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారని చెప్పారు. మార్కెట్ పడిపోయినప్పుడు కొనుగోలు చేయడం, పెరిగినప్పుడు లాభాలు స్వీకరించడమనే విధానాన్ని అవలంబిస్తున్నట్లు స్వామి వెల్లడించారు.
