న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఎప్పటికీ ఉచితమేనని ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. కొత్త ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత లావాదేవీల చార్జీలపై చర్చ మొదలైంది. ఇక నుంచి కూడా యూజర్లు ఎలాంటి చార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేసే అంశంపై చర్చ జరుగుతోందని, రూ.రెండు వేలకు పైగా ఉన్న కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.20 శాతం నుంచి 0.40 వరకు ఎండీఆర్ వర్తించే అవకాశం ఉందని అన్నారు. వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి లెవీ ఉండదని సమీర్ స్పష్టం చేశారు.
చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు యూపీఐ చెల్లింపులను స్వీకరించడానికి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది.
