- రష్యా నుంచే 40 శాతం సరఫరా
న్యూఢిల్లీ:పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణల కారణంగా భారత్ ముడి చమురు దిగుమతి బిల్లు 26 శాతం పెరిగింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో దిగుమతి బిల్లు 49 బిలియన్ డాలర్లకు (రూ.4,11,600 కోట్లు) చేరుకుంది. దిగుమతి పరిమాణం 18 శాతం తగ్గినా, ధరలు మాత్రం బాగా పెరిగాయి. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో దేశం 59.7 మిలియన్ టన్నుల ముడి చమురును కొనుగోలు చేసింది.
అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 73 మిలియన్ టన్నుల దిగుమతి అయింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణల ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వ్యూహాత్మక హార్మూజ్ జలసంధి మీదుగా జరిగే రవాణా దెబ్బతినడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రష్యా ఈ త్రైమాసికంలో భారతదేశానికి అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా నిలిచింది.
అక్కడి నుంచి 40 శాతానికి పైగా దిగుమతులు జరిగాయి. యూఏఈ, సౌదీ అరేబియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా దిగుమతి భారం విపరీతంగా పెరిగిందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి.
