మెదక్(చేగుంట), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గెస్ట్ హౌజ్ వద్ద నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్లో కొంత భాగాన్ని గ్రామస్తులు కూల్చివేశారు. హైదరాబాద్–నాగపూర్ హైవే పక్కన మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్ సమీపంలో షబ్బీర్ అలీ గెస్ట్ హౌజ్ ఉంది.
అక్కడ ఉన్న భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారు. ఈక్రమంలో శనివారం గ్రామస్తులు అక్కడికి తరలివచ్చి కర్రలు, గడ్డపారలతో పొలాలకు వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన కాంపౌండ్ వాల్లో కొంత భాగం కూల్చి వేశారు. తమ పొలాలు, కుంటలకు వెళ్లే రోడ్డును ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని ఆరోపించారు.
తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో 200 ఎకరాల పొలాలకు వెళ్లేందుకు దారి ఉండదన్నారు. దారి లేకుంటే తాము పంటలు ఎలా సాగు చేసుకోవాలని ప్రశ్నించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, దీంతో అక్రమంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ను కూల్చివేశామన్నారు.
