వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
  • వారం, పది రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం
  • కేబినెట్​లో నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన
  • బనకచర్లపై కేంద్రం దగ్గరే తేల్చుకుందామని వెల్లడి
  • ఇందుకోసం 18, 19 తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:  వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని.. ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. వారం, పది రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో కొందరు మంత్రులు చేస్తున్న ముందస్తు ప్రకటనలపై సీఎం అసహనం వ్యక్తంచేశారు. కేబినెట్‎లో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఎన్నికలపై మాట్లాడడం కరెక్ట్​ కాదన్నారు. పైగా ఈ అంశం హైకోర్టులో ఉన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని సూచించారు. 

‘‘మంత్రులు ప్రభుత్వ  పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేయకుండా.. స్థానిక ఎన్నికలపై ప్రకటనలు చేయడం ఏంటి? ముందు ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తోందో చెప్పుకోవడంపై దృష్టి పెట్టండి’’ అంటూ సీఎం అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్​కంట్రోల్ సెంటర్‎లో సోమవారం సీఎం రేవంత్​ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలకు వెళ్లేముందు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. లీగల్​సమస్యలు వస్తే పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలపై ముందుకు 
వెళ్లాల్సి ఉంటుందని మంత్రులకు సూచనప్రాయంగా తెలిపారు.

హైకోర్టులో స్థానిక ఎన్నికలపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందని, అది  త్వరలోనే క్లియర్ అవుతుందని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నెల చివరి వారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి లోకల్​బాడీ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు. ముందు సర్పంచ్​ ఎన్నికలా? లేదంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలా? అనేదానిపై ఆ రోజే డిసైడ్​ చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. 

మంత్రులు పనితీరు మెరుగు పర్చుకోవాలి..  

‘‘మనది రైతు సంక్షేమ ప్రభుత్వం. ఈసారి వానాకా లం సీజన్ ముందే వచ్చినందున పెట్టుబడి సాయం కూడా ముందే ఇద్దాం. అందుకే రైతు నేస్తం కార్యక్ర మం ద్వారా రైతు భరోసాను కూడా సోమవారం నుంచే ప్రారంభించాం..’’ అని మంత్రులకు సీఎం తెలిపారు. గతానికి భిన్నంగా ఈ సారి జూన్​ నెల పూర్తయ్యేలోపే రైతులందరికీ పూర్తిస్థాయిలో రైతు భరోసా నిధులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలను మంత్రులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రులు వారి శాఖల్లో అమలవుతున్న స్కీములు, ఇతర సంస్కరణలు, కార్యక్రమాలపై నెలవారీగా టార్గెట్లు పెట్టుకుని పూర్తి చేయాలని సీఎం సూచించారు. 

అప్పుడే పనితీరు మెరుగుపడుతుందన్నారు. డిపార్ట్​మెంట్లలో ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్నారు. కొత్తగా వచ్చిన ఇన్​చార్జి మంత్రులతో.. ఆయా జిల్లాల మంత్రులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. జోడెడ్ల మాదిరి అభివృద్ధి పనుల్లో ముందుండాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం దగ్గరే తేల్చుకోవాలని డిసైడ్​ అయినట్లు సీఎం మంత్రులకు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి తెలంగాణ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తామని.. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్​మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అపాయింట్​మెంట్​రాగానే  ఆయనను కూడా కలుస్తామని సీఎం మంత్రు లకు వివరించారు.