హైదరాబాద్ ట్రాఫిక్పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ ట్రాఫిక్పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు మూడు నెలల్లోగా తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. సెక్రటేరియట్ లో గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను వెంటనే ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని సూచించారు. 

ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సరిపడే సంఖ్యలో  సిబ్బంది ఉండేలా స్టేషన్లను పునర్ వ్యవస్థీకరించాలన్నారు. సిటీలో రోడ్లు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లలో ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. సిటీ పరిధిలో అన్ని జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకుండా ట్రాఫిక్ సిబ్బంది అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు సీఎం రేవంత్. 

మూడు కమీషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమీషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు సీఎం. నెలకొకసారి సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించాలని చెప్పారు. సిటీలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్నారు. అందుకు అవసరమైన ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలన్నారు రేవంత్. గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కన్సలెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.