
- న్యాయ వ్యవస్థ బలోపేతానికి సహకారం అందిస్తం: రేవంత్
హైదరాబాద్, వెలుగు: ప్రాధాన్యతా క్రమంలో వివిధ జిల్లాల్లో కోర్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా సిబ్బందిని నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం లాంటి అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి సీజే అపరేశ్ కుమార్ సింగ్ సూచించారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
కాగా, న్యాయ వ్యవస్థ బలోపేతానికి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర సర్కారు అందిస్తుందని రేవంత్ తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్ కె.రామకృష్ణా రావు, జస్టిస్ పి.సామ్కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.