
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
ముఖ్యంగా పాతబడిన ఇళ్లలో ఉన్న వారిని వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలనిఅధికారులను ఆదేశించారు సీఎం. వాగులపై ఉన్న లోతట్టు కాజ్ వేలు, కల్వర్టులపైనుంచి నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచించారు.