- ఎల్నినో ప్రభావం పడకుండా చూడాలి
- నీటి వనరులనుఅనుసంధానం చేయాలి
- నిర్దేశిత సమయంలో ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేయాలి
- వాటర్బోర్డు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగునీటి సరఫరా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని సీఎంరేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగునీటి సరఫరా ఒకే విధంగా ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని సూచించారు. హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్హెచ్ఆర్డీలో గురువారం సమీక్ష నిర్వహించారు.
ఎల్నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగు నీటి వనరులను అనుసంధానించాలని సీఎం సూచించారు. ఏదైనా కారణాలతో ఒక సోర్స్ నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో సోర్స్ నుంచి వచ్చే నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు కనెక్టివిటీ ఉపయోగపడుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని, ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదని సీఎం అన్నారు. ఆయా ప్రాంతాలకు కూడా రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగునీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోపు కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు తేల్చిచెప్పారు.
ఎస్టీపీల నిర్మాణ పనులపై సీఎం ఆరా తీశారు. ఎస్టీపీల నిర్మాణాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల పురోగతిపై ప్రతి నెల తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు, వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్ వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, జేఎండీ మయాంక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు15 కల్లా పిల్లలకు యూనిఫాంలు అందాల్సిందే
యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా వచ్చే ఏడాది పంపిణీ, వాటి రంగులు ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫాంల అందజేతపై సీఎం ఎంసీఆర్హెచ్ఆర్డీలో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లు, వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు అందజేసే యూనిఫాంల నాణ్యతలో రాజీపడబోమని సీఎం తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి పిల్లలందరికీ యూనిఫాం అందజేయాల్సినదేనని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించనని సీఎం హెచ్చరించారు. మహిళా సంఘాలు కుట్టు పని వేగవంతం చేసేలా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్యకు సీఎం సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాంల అందజేతలో అడ్డగోలుగా వ్యవహరించారని సీఎం అన్నారు. తాము వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. నాణ్యమైన యూనిఫాంలు అందిస్తామని తెలిపారు. పేద పిల్లల కోసం పని చేస్తున్నామనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వచ్చే సంవత్సరం జూన్ 2 నాటికే విద్యార్థులకు యూనిఫాం అందేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు బాలమాయా దేవి, షఫీ ఉల్లా, విజయేంద్ర బోయి, దివ్య తదితరులు పాల్గొన్నారు.
