
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి.. నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమ వైతాళికుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా తెలంగాణకు, సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిరంకుశ పాలన మీదికి ఎక్కు పెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అన్నారు.
పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడని కొనియాడారు. ‘‘ప్రజల్లో చైతన్యం నింపిన ధీశాలి. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అనునిత్యం సమ సమాజం కోసం తపించిన గొప్ప వ్యక్తి దాశరథి’’ అని అన్నారు. కథలు, నాటికలు, సినిమా పాటల రచనల ద్వారా తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలోనూ విశేషంగా కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దాశరథి రచించిన పద్యాలు, పాటలు ఇప్పటికీ ప్రజలందరికీ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. దశారథి స్ఫూర్తితోనే తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ప్రభుత్వం సన్మానించి, చేయూత అందించిందన్నారు.
అచ్యుతానందన్ మృతికి రేవంత్ సంతాపం
కేరళ మాజీ సీఎం వీఎస్. అచ్యుతానందన్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
మచ్చలేని మహానేత అచ్యుతానందన్: బీవీ రాఘవులు
దేశ రాజకీయాల్లో మచ్చలేని మహానేత వీఎస్.అచ్యుతానందన్ అని సీపీఎం పొలిట్ బ్యూరోసభ్యుడు బీవీ. రాఘవులు పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. కమ్యూనిస్టు యోధుడు అచ్యుతానందన్ ఈ తరానికి ఆదర్శవంతులు అని నారాయణ పేర్కొన్నారు. అచ్యుతానందన్ మృతిపై ఆయనతోపాటు సీపీఐ పార్టీ నేతలు పలువురు సంతాపం తెలిపారు.