తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలి.. మోదీకి రేవంత్ వినతి

తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలి.. మోదీకి రేవంత్ వినతి

హైదరాబాద్ లో ఐఐఎం(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్)  ఏర్పాటు  చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర పర్యటన ముగించుకొని వెళ్తున్న ప్రధాని మోదీకి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు ముఖ్యమంత్రి. NTPC లో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని... మిగిలిన 2 వేల 400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తామన్నారు. 

హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధితో పాటు...  మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని మోదీని కోరారు రేవంత్. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.... భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా ప్రధాని జోక్యం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలన్నారు సీఎం. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ కోసం 3 కోట్లు మంజూరు చేసిందని వినతి పత్రంలో గుర్తు చేశారు. 7 వేల 700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని మోదీని కోరారు సీఎం. ఈ కారిడార్ తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల  దూరం తగ్గుతుందని వివరించారు. 

రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. 10 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీరు అందటం లేదన్నారు. సమీపంలోని నీటి వనరులతో గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

 రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్య , పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా IPS క్యాడర్ రివ్యూ చేయాలన్నారు. కేంద్ర హోంశాఖ 2016 లో తెలంగాణకు 76 IPS కేడర్ పోస్టులను మంజూరు చేసిందన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభా ఆధారంగా రాష్ట్రంలో  పోలీసు అధికారుల అవసరం పెరిగిందన్నారు సీఎం.  అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాలని కోరారు. 

హైదరాబాద్– రామగుండం, హైదరాబాద్–నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 13 వందల 50 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. లీజు గడువు ముగిసిన శామీర్ పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వెయ్యి 38 ఎకరాల భూములను తిరిగి అప్పగించాలన్నారు రేవంత్. 

IIT, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీ తో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు సీఎం. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి రాష్ట్రంలో ఒక IIM నెలకొల్పాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో IIM ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో తెలిపారు సీఎం రేవంత్. అందుకు అవసరమైనంత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. 

నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రధానికి వివరించారు సీఎం రేవంత్.  5 వేల 259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని....  2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన 347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు.  

భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా కలిగేలా 8 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు సీఎం. కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్–నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంగర్ ఫోర్ లేన్, జడ్చర్ల–మరికల్ ఫోర్ లేన్, మరికల్–డియాసాగర్ లో నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు సీఎం.  

ALSO READ :- Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేష్ ఫస్ట్ టాక్..ఆ మూడు సినిమాలే నన్ను నిలబెట్టాయి

తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరారు సీఎం. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీకి వివరించారు సీఎం. సెమీ కండక్లర్లు, డిస్ ప్లే మ్యానుఫ్యాక్షరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా కేంద్రం సాయం అందించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి.