పనిచేస్తే ప్రోత్సహిస్తాం.. నిర్లక్ష్యం వహిస్తే పీకి పారేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

పనిచేస్తే ప్రోత్సహిస్తాం..  నిర్లక్ష్యం వహిస్తే పీకి పారేస్తాం :  సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించండని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని చెప్పారు.  మే 25వ తేదీ శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వర్షాలతోపాటు పలు అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థను రూపొందించాలని సీఎం చెప్పారు. జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు. నాళాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దని.. పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలన్నారు.  క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోడ్ ముగిసిన తరువాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా... పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.  ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని. వాటికి బారీకేడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం చెప్పారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో నాళాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలన్నారు. సమస్యాత్మక నాళాల వద్ద అవసరమైతే ప్రతీ రోజు క్లీనింగ్ చేపట్టండని చెప్పారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలన్నారు. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ తెలిపారు.