వరద నీటిని వృథా కాకుండా చూడండి.. ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రివ్యూ

వరద నీటిని వృథా  కాకుండా చూడండి.. ప్రాజెక్టులపై సీఎం రేవంత్  రివ్యూ

 తెలంగాణలో భారీ వర్షాలకు వచ్చిన  వరద నీటిని వృథా కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని  భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ ,మంత్రి ఉత్తమ్..  శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.  రంగనాయక సాగర్ నుంచి నీటిని పంప్‌ చేసి మల్లన్న సాగర్..  కొండపోచమ్మ సాగర్ నింపాలని.. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని అధికారులను  ఆదేశించారు రేవంత్.

కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో అన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు.