
- తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు..
- రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
- రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వాన్ని నడుపలేం.. 18 నెలల్లోనే అన్నదాతల సంక్షేమానికి రూ. లక్ష కోట్లు ఖర్చు
- నాడు వరి వేస్తే ఉరి అన్నోళ్లు.. ఇప్పుడు రైతుల పేరిట నాటకాలాడ్తున్నరు
- పదేండ్లు పాలించి వందేండ్ల విధ్వంసం సృష్టించారు
- భార్యాభర్త ఫోన్లనూ ట్యాప్ చేశారు
- ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం
- చావుల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నదని ఫైర్
- ‘రైతు నేస్తం’ ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో 70,11,984 మంది రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. సోమవారం అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘రైతు నేస్తం’ వేదిక నుంచి ఆయన ఆన్లైన్లో స్విచ్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల ఆశీర్వాదం లేకుండా ఎవరూ అధికారంలోకి రాలేరని, రైతు సంక్షేమమే పరిపాలనలో ముఖ్య లక్ష్యమని చెప్పారు. ‘‘రైతును రాజును చేయడమే కాదు.. వ్యవసాయాన్ని పండుగ చేస్తం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. ప్రజా ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే రైతుల సంక్షేమం కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా అన్నదాతలకు అండగా నిలుస్తున్నం” అని పేర్కొన్నారు.
నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారు
‘‘పదేండ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారు. వాళ్లు పదేండ్లలో చేసిన విధ్వంసం వల్ల వందేండ్లయినా కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థగా మార్చారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు” అని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని, రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.
‘‘పదేండ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఇప్పుడు రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నారు. పదేండ్లు రుణమాఫీ పేరిట నాన్చి.. 16, 17 వేల కోట్లు ఇస్తే అవి మిత్తీలకే సరిపోలేదు” అని పేర్కొన్నారు. రాష్ట్రంపై గత ప్రభుత్వం రూ. 8.29 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందన్నారు. కాంట్రాక్టర్లకు రూ. 60 వేల కోట్లు, విద్యుత్ బిల్లులు రూ. 20 వేల కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 12 వేల కోట్లు గత సర్కార్ బకాయిపెట్టి పోయిందని ఫైర్ అయ్యారు. స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ను కూడా సరిగా అమలు చేయలేదన్నారు.
‘‘వాళ్లు అప్పులు నెత్తిపై పెట్టి పోతే.. ఒక్కో వ్యవస్థను మేం ప్రక్షాళన చేస్తున్నం. వాళ్లు చేసిన విధ్వంసం వల్ల ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కష్టంగా ఉంది. అయినా.. ఆ కష్టాలను ఎదుర్కుంటూనే అన్నీ అమలు చేస్తున్నం. ప్రజా సంక్షేమానికే టాప్ ప్రయారిటీ ఇస్తున్నం”అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేండ్లు ప్రజా ప్రభుత్వమే ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని బొందల గడ్డగా బీఆర్ఎస్ నేతలు మార్చారని, అలాంటి వాళ్లు ఇప్పుడు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన
మండిపడ్డారు.
నాడు వరి వేస్తే ఉరే అన్నరు
‘‘వరి వేస్తే ఉరి వేసుకోవాల్సిందేనని నాడు కేసీఆర్ అన్నడు. వరి వేయండి.. చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మాది. చివరి గింజ వరకూ కొంటున్నం. తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క సంవత్సరంలో 2.80 కోట్ల టన్నుల వడ్లు పండాయి” అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రైతుల కండ్లలో ఆనందం చూస్తున్నామని, ముఖ్యమంత్రిగా తనకు ఇంతకంటే ఇంకేం కావాలని ఆయన అన్నారు. ‘‘పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకుగాను సన్న వడ్లు పండించేలా రైతులను ప్రోత్సహించాం.
సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తున్నం. సన్న వడ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రైతుల శ్రమతో రైతులు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్నంబియ్యం అందించి పేదల కడుపు నింపుతున్నం” అని తెలిపారు. లీడర్లు గెలవాలంటే రైతన్నల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాల్సిందేనని.. ఇందిరమ్మ రాజ్యంలో రైతులే రాజులని అన్నారు. ‘‘రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు.
ఈ దేశంలో ఎవరు ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల ఆశీర్వాదం, రైతుల చేయూత ఉండాల్సిందే. వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్లో గెలవాలన్నా, శాసనసభలో ప్రాతినిధ్య వహించాలన్నా, పార్లమెంట్కు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడి ఆశీర్వదిస్తేనే సాధ్యమని బలంగా విశ్వసిస్తున్న” అని ఆయన వివరించారు.
భార్యాభర్తల ఫోన్లను వదల్లేదు
రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. ‘‘చావుల పునాదులపై అధికారంలోకి రావాలనే దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నయ్. రైతులు, విద్యార్థుల సమస్యలను రాజకీయంగా వాడుకుంటున్నయ్. భార్యాభర్త మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఫోన్ ట్యాపింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడ్డవాళ్లు.. ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నరు” అని బీఆర్ఎస్ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమ ప్రజా ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని అందిస్తున్నదని తెలిపారు. ‘‘కొంత కాలమైనా సమయం ఇవ్వరా.. ? సరిదిద్దుకొనివ్వరా? వాళ్లు (బీఆర్ఎస్ నేతలు) చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అయినా మేం ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ వస్తున్నం. ఒక సంవత్సరంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. సివిల్ సర్వీసెస్లో రాణించేందుకు పేద విద్యార్థులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నం” అని ఆయన పేర్కొన్నారు.