ఓయూ, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఓయూకు రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సభా వేదిక ఏర్పాటు చేశారు. దూరంగా ఉన్నవారు కూడా కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సభకు హాజరయ్యేవారు భద్రతా తనిఖీల కోసం తప్పనిసరిగా చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డులు తీసుకురావాలని పోలీసులు కోరారు.
డిసెంబర్లో వస్తానని..
ఆగస్టు 25న ఓయూకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఠాగూర్ ఆడిటోరియంలో మాట్లాడుతూ వర్సిటీలో సౌకర్యాల మెరుగు కోసం రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. మళ్లీ డిసెంబర్ లో తిరిగి వచ్చి మాట్లాడతానన్నారు. ఈ నేపథ్యంలోనే సర్వం సిద్ధం అనే నినాదంతో బుధవారం ఉదయం 11 గంటలకు ఓయూకు సీఎం రాబోతున్నారు. దీంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని టీచింగ్, నాన్టీచింగ్స్టాఫ్, విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
