- వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడి ఘటనపై స్పందించిన సీఎం
- మెరుగైన వైద్యం, తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్: హయత్ నగర్ లో మూగ బాలుడు ప్రేమ్ చంద్ పై నిన్న వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం పేపర్లలో ఈ ఘటన వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ప్రేమ్ చంద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలుడికి అవసరమైన తక్షణ సాయం అందించాలని.. ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకోవాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. తక్షణం వీధి కుక్కల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
