
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో 70,11,984 మంది రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. సోమవారం అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘రైతు నేస్తం’ వేదిక నుంచి ఆయన ఆన్లైన్లో స్విచ్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. రైతుల ఆశీర్వాదం లేకుండా ఎవరూ అధికారంలోకి రాలేరని, రైతు సంక్షేమమే పరిపాలనలో ముఖ్య లక్ష్యమని చెప్పారు. ‘‘రైతును రాజును చేయడమే కాదు.. వ్యవసాయాన్ని పండుగ చేస్తం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. ప్రజా ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే రైతుల సంక్షేమం కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా అన్నదాతలకు అండగా నిలుస్తున్నం” అని పేర్కొన్నారు.
నాడు వరి వేస్తే ఉరే అన్నరు
‘‘వరి వేస్తే ఉరి వేసుకోవాల్సిందేనని నాడు కేసీఆర్ అన్నడు. వరి వేయండి.. చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మాది. చివరి గింజ వరకూ కొంటున్నం. తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క సంవత్సరంలో 2.80 కోట్ల టన్నుల వడ్లు పండాయి” అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
రైతుల కండ్లలో ఆనందం చూస్తున్నామని, ముఖ్యమంత్రిగా తనకు ఇంతకంటే ఇంకేం కావాలని ఆయన అన్నారు. ‘‘పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకుగాను సన్న వడ్లు పండించేలా రైతులను ప్రోత్సహించాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తున్నం. సన్న వడ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రైతుల శ్రమతో రైతులు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్నంబియ్యం అందించి పేదల కడుపు నింపుతున్నం” అని తెలిపారు.
లీడర్లు గెలవాలంటే రైతన్నల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాల్సిందేనని.. ఇందిరమ్మ రాజ్యంలో రైతులే రాజులని అన్నారు. ‘‘రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఈ దేశంలో ఎవరు ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల ఆశీర్వాదం, రైతుల చేయూత ఉండాల్సిందే. వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్లో గెలవాలన్నా, శాసనసభలో ప్రాతినిధ్య వహించాలన్నా, పార్లమెంట్కు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడి ఆశీర్వదిస్తేనే సాధ్యమని బలంగా విశ్వసిస్తున్న” అని ఆయన వివరించారు.
ఇతర పంటలపైనా దృష్టి పెట్టాలి
వరి పంటనే కాకుండా ఇతర లాభసాటి పంటలను పండించాలని రైతులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ‘‘భూమి సారాన్ని భట్టి ఏ భూమిలో ఏ పండ్ల తోటలు వస్తాయో.. ఏ భూమిలో ఏ కూరగాయలు పండుతాయో.. ఏ భూమిలో ఏ పంట అధిక దిగుబడి వస్తుందో.. పత్తి వస్తుందా, మిర్చి వస్తుందా, లేకపోతే కందులు వస్తాయా అని ఆలోచించి సాగు చేపట్టాలి. మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేం కందులు పండిస్తం.
తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే గొప్ప పేరు ఉంది. అచ్చంపేట ప్రాంతంలో పోతే దోసకాయలు పండుతాయి. దోసకాయ, కందిపప్పు కూర ఎంత బ్రహ్మాండంగా ఉంటది.. చికెన్ మటన్ కూడా పనికిరాదు దాని ముందు. ఇప్పుడున్న పిల్లలకు ఆ రుచి తెలవకుంటానే పోయింది. కూరగాయలు, పండ్లు పక్క రాష్ట్రాల్లో నుంచి తెచ్చుకుంటున్నం. ఇక్కడే వాటిని పండించుకుందాం” అని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రజల కోసం రోజూ 18 గంటలు పనిచేస్తున్నామని, తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
90% సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు
సోలార్ పంపుసెట్లు, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై రైతులకు కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి వ్యవసాయ పనిముట్లను 90% సబ్సిడీతో అందజేయాలని, సోలార్ విద్యుత్ ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి, భూమి సారాన్ని కాపాడుతూ లాభసాటి పంటలు పండించేలా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామాల్లో రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించేందుకు అనుభవజ్ఞులైన రైతులను గుర్తించి, వారికి రూ. 1,000 గౌరవ వేతనం ఇచ్చి ప్రోత్సహించాలని కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
రుణమాఫీ అయింది.. సన్నాలకు బోనస్ వస్తున్నది
రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో రైతులు
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా1,034 రైతు వేదికల నుంచి రైతులు భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముచ్చటించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక తమకు రుణమాఫీ జరిగిందని, సన్నాల సాగు ద్వారా బోనస్ వచ్చిందని వివిధ ప్రాంతాల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
డ్రిప్ ఇవ్వండి..
నాకు మూడెకరాలు భూమి ఉన్నది. కూరగాయలు పండిస్తా. మా ఊరు వికారాబాద్ జిల్లా చౌదరి పల్లి నుంచి రోజుకు ఆరు డీసీఎంల కూరగాయలు హైదరాబాద్కు వస్తున్నాయి. 700 ఫీట్లు బోర్ ఏస్తే నీళ్లు పడుతాయి. కూరగాయల సాగుకు మాకు డ్రిప్ ఇవ్వండి. చిన్న చిన్న పవర్ వీడర్లు కూడా ఇవ్వాలి. ఆలుగడ్డ పండిస్తే లక్ష రూపాయలు వచ్చినయి. మక్కలు పెడితే మంచి లాభం వచ్చింది. హైదరాబాద్ సిటీ చుట్టూ భూములన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు అయినవి. ఒకప్పటి లెక్క పాల క్యాన్లు, కూరగాయలు సిటీకి వస్తలేవు. సిటీ చుట్టు కూరగాయలు, పండ్ల తోటలు పెంచాలి.
- వెంకట రామయ్య, రైతు, చౌదరి పల్లి
లక్షా 65 వేలు మాఫీ అయింది
మాది మహబూబాబాద్ జిల్లా జమాన్లపల్లి. నేను మిరప పంట ఎక్కువగా సాగు చేస్తుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీతో నాకు రూ.1.65లక్షల పంటరుణం మాఫీ అయింది.
- అజ్మీరా ద్వాలి, రైతు, జమాన్లపల్లి