
- మెడికల్ కాలేజీల్లో వసతుల కోసం అధికారులతో కమిటీ
- మూడేండ్లలో పూర్తి స్థాయి సౌలతులు
- హాస్పిటళ్ల టైమింగ్ పర్యవేక్షణకు యాప్
- నర్సింగ్ కాలేజీల్లో ఆప్షనల్సబ్జెక్ట్గా జపనీస్
- సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీలు పూర్తిస్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కమిటీ రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీని సందర్శించి సమగ్ర వివరాలతో రిపోర్ట్ సమర్పించాలని సీఎం స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖపై సోమవారం ఇంటిగ్రేటెడ్కమాండ్కంట్రోల్సెంటర్లో సీఎం రేవంత్రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలలు జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలి.
అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే మూడేండ్లలో అన్ని మెడికల్ కాలేజీల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సమగ్ర యాక్షన్ప్లాన్ను రూపొందిస్తుంది” అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని, కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు లేదా అనుమతులకు సంబంధించిన సమస్యలు ఉంటే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లు, వారిని పరీక్షించే డాక్టర్లు, ఆస్పత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్ను వినియోగించే అంశంపై స్టడీ చేయాలని అధికారులకు సూచించారు. ఇకపై ప్రతినెలా వైద్యారోగ్య, విద్యా శాఖలపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మెడికల్ కాలేజీలు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నిబంధనలకు తగ్గట్టు పనిచేయాలని సీఎం సూచించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఎన్ఎంసీ లేవనెత్తిన అంశాలపై చర్చించిన సీఎం రేవంత్రెడ్డి.. వైద్య విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులతో ఏర్పాటు చేసే కమిటీ ప్రతి మెడికల్ కాలేజీ సందర్శిస్తుందన్నారు. అక్కడి అవసరాలు, వెంటనే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయంపై వివరణాత్మక నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియామకాలు, బోధన సిబ్బంది ప్రమోషన్లు, అనుబంధ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంపు, వైద్య పరికరాల సమకూర్పు, ఖాళీల భర్తీ వంటి అంశాలను కూడా ఈ నివేదికలో చేర్చాలని ఆయన ఆదేశించారు.
జపాన్లో నర్సింగ్ స్టాఫ్కు మంచి అవకాశాలు
నర్సింగ్ కాలేజీల్లో జపనీస్ భాషను ఆప్షనల్ సబ్జెక్ట్గా చేర్చాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. జపాన్లో తెలంగాణ నర్సింగ్ సిబ్బందికి గణ నీయమైన డిమాండ్ ఉందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి జపనీస్ భాషా శిక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో జపాన్ ప్రభుత్వం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, ఇదివిద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.