రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: నామినేషన్ల ప్రాసెస్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళీకేరి అధికారులను ఆదేశించారు. శనివారం కొంగరకలాన్లోని కలెక్టరేట్లో ఆమె అధికారులతో సమావేశమయ్యారు. భారతి హోళీకేరి మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ రోజు నుంచి ముగిసేవరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు వంద మీటర్ల దూరంలో ఇండికేషన్లను ఏర్పాటు చేయాలన్నారు.
నామినేషన్ వేసే వారితో పాటు మరో నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. నామినేషన్ల పూర్తి ప్రాసెస్ సీసీ కెమెరాలతో నిఘా మధ్యలో జరగాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమ, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.