
మిర్యాలగూడ, వెలుగు : ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలందరినీ భవిత కేంద్రాల్లో చేర్చాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గురువారం మిర్యాలగూడలో భవిత కేంద్రాన్ని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ఆప్యాయంగా పలకరించి చాక్లెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూవిద్యాశాఖ నుంచి పిల్లలకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. రిపేర్లతో ఉన్న భవిత కేంద్రాన్ని పిల్లల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అధికారులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో డీఈవో భిక్షపతి, ఎంఈవో బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై జిల్లా, మండల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, హాస్టళ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాల గదులు, ఆవరణ, వంటగది, టాయిలెట్లు శుభ్రంగా ఉండాలన్నారు.
అన్ని పాఠశాలల్లో బ్లీచింగ్ పౌడర్ తోపాటు గడ్డి, కలుపు మొక్కలు తొలగించాలని చెప్పారు. రెండు వారాల్లో వీటన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా వర్షం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. పాము, తేలు కాటుకు గురైనా సంబంధిత ఎంఎస్ వో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులకు షో కాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. టెలీకాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.