
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : విద్యార్థులు సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం కనగల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంటర్ఫస్టియర్ విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి చాక్లెట్లను పంపిణీ చేశారు. అంతకుముందు కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఆమె సందర్శించారు.
మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన టాయిలెట్ బ్లాక్, మంచినీటి, భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, ఆఫీస్ బిల్డింగ్ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎస్టిమేషన్లు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ లో మొబైల్ గ్రైన్ డ్రయర్ ను పరిశీలించారు. జిల్లాలో యంత్రాంగం 2 మొబైల్ గ్రైన్ డ్రయర్లను కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీశ్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయదేవి, అధికారులు తదితరులు ఉన్నారు.
చెరువుల ఆక్రమాణలకు పాల్పడితే కేసులు
ఎవరైనా చెరువులు, కుంటల ఆక్రమణలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం నల్గొండలోని కలెక్టరేట్ లో ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను చెప్పారు. ఇకపై జిల్లాలోని లేఔట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు.