ఆగస్టు 15 నాటికి భూసమస్యలు పరిష్కారం : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

 ఆగస్టు 15 నాటికి భూసమస్యలు పరిష్కారం  : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలించి ఆగస్టు 15 నాటికి భూసమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 3 నుంచి 20 వరకు జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి 44,741 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

 భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో ఒక బృందం,  క్షేత్ర స్థాయి పరిశీలించేందుకు మరో బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా చెక్ మెమో తయారు చేసి అన్ని రికార్డులను జతపర్చి అధికారులు సంతకం చేయాలన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీవోలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.