ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్​లో ఉద్యానవన అధికారులు, పతంజలి సంస్థ ప్రతినిధులతో ఆయిల్ పామ్ సాగుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 15 రోజుల్లో ఆసక్తి గల రైతులకు చెందిన 800 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎవరైనా ఆర్థిక సమస్యతో బాధపడే రైతులకు సహకార బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి డ్రిప్ట్ ఇరిగేషన్ కోసం డీడీలు తీయించాలని చెప్పారు.

 ఆయిల్ పామ్ సాగుపై  రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు కాల్ సెంటర్, మొబైల్ యాప్ ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 4,740 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుందని తెలిపారు. 2025– -26లో నూతనంగా 3 వేల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, ఉద్యానవన టెక్నికల్ అధికారి మహేశ్, మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్ నరేశ్, పతంజలి కంపెనీ అధికారులు పాల్గొన్నారు.