రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు చెక్ : కలెక్టర్ ఇలా త్రిపాఠి

రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు చెక్ : కలెక్టర్ ఇలా త్రిపాఠి

హాలియా, వెలుగు : ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం గుర్రంపూడు మండలం పోచంపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ ఎవరికైనా భూసమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి

యాదగిరిగుట్ట, వెలుగు : గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. గురువారం బొమ్మలరామారం మండలం తిమ్మాపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యల గురించి రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. రిజిస్ట్రేషన్, మార్పులు, చేర్పులు వంటి చిన్న చిన్న సమస్యలుంటే రెవెన్యూ అధికారులే స్వయంగా ఇంటికొచ్చి పరిష్కరిస్తారని పేర్కొన్నారు.