ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన విషాద సంఘటన కేరళలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం రాత్రి కన్నూర్ జిల్లాలోని పున్నచ్చేరిలో కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తొమ్మిదేళ్ల బాలుడితోపాటు లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం పరియారం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సీఏ చదువుతున్న తన కొడుకు సౌరవ్ను కోజికోడ్లోని హాస్టల్లో దించి సుధాకరన్, అతని కుటుంబ సభ్యులు కారులో ఇంటికి తిరిగి వస్తుండగా... కన్నాపురం ప్రాంతంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మంగళూరు నుంచి గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ ఢీకొట్టినట్లు పోలీసులు చెప్పారు.
మృతులను కలిచనడుక్కంకు చెందిన కెఎన్ పద్మకుమార్ (59), భీమానదికి చెందిన చూరిక్కట్ సుధాకరన్ (52), అజిత (35), కోజుమ్మల్ కృష్ణన్ (65), ఆకాష్ (తొమ్మిది)లుగ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.