- కామెంట్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలి
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం
బషీర్ బాగ్, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగులపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం ఖండించింది. ఏసీల్లో ఉండే ఉద్యోగులకు ముందుగా జీతాలు ఇస్తున్నారని హరీశ్రావు చేసిన కామెంట్స్ వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ మంజీత్ సింగ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లోని సంఘ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని, ఉద్యోగులు కూడా రైతు కుటుంబాల నుండే వచ్చారని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు మూడు డీఏలను చెల్లించలేదని, రియింబర్స్ మెంట్ బిల్లులు ఐదేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. జీవో. 5ను రద్దు చేసి , కొత్త వాహనాలను కొనుగోలు చేసి డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
ఇచ్చిన హామీ మేరకు ఒకటో తేదీన తమకు జీతాలు చెల్లించడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ శ్రీనివాస్ , అసోసియేట్ ప్రెసిడెంట్ పంతులు శ్రీనివాస్ , కోశాధికారి సయ్యద్ హుస్సేని , రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇ పద్మారావు , నేతలు ఎం. రామచంద్రం, అలీం ఖాన్ పాల్గొన్నారు.