
అగ్రి చట్టాలు, రైతుల ఆందోళనల ఎఫెక్ట్ బీజేపీపై భారీగానే చూపిస్తోంది. పంజాబ్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మోగా, హోషియార్ పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్ కోట్, బాటాలా, బఠిండాల్లో విజయం సాధించింది. మరో స్థానం మొహాలీకి సంబంధించి రేపు(గురువారం) ఫలితాలను ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.
బఠిండా మున్సిపల్ కార్పొరేషన్ పై 53 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు జెండాను ఎగరవేసింది. బఠిండా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వం వహిస్తుంటే.. ఇటీవలే ఎన్డీయే నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీ దళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ లోక్ సభ నియోజకవర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే, పైచేయి కాంగ్రెస్ దే అయ్యింది.
ఫిబ్రవరి 14న 109 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 71.39 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని బూత్ లలో మంగళవారం రీపోలింగ్ జరిగింది. మొహాలీ కార్పొరేషన్ కు సంబంధించి 32, 33వ నెంబర్ బూత్ లకు రీపోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మొహాలీ కార్పొరేషన్ ఫలితాలను గురువారం ప్రకటించనున్నారు.