
- స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు అప్పగించిన హైకమాండ్
- నూటికి నూరు శాతం రిజల్ట్ రావాలని ఆదేశాలు
- ఇప్పటికే దిశానిర్దేశం చేసిన రేవంత్, మీనాక్షి నటరాజన్
- కాంగ్రెస్లో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు
- టికెట్ల కోసం పట్టుబడుతున్న సీనియర్ లీడర్లు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకు అప్పగించింది. నూటికి నూరు శాతం పంచాయతీలు, పరిషత్లు కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఇటీవల మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ అనంతరం కొన్ని జిల్లాల ఇన్చార్జీలను మార్చడం, ముగ్గురు సీనియర్ మంత్రులను తప్పించి, కొత్తవారికి అవకాశం కల్పించడం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేసినట్లు చర్చ జరుగుతున్నది.
ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు పరీక్ష లాంటిదని ఇప్పటికే సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పార్టీ శ్రేణులకు వివరించారు. దీన్ని బట్టి హైకమాండ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుంటున్నదో అర్థం చేసుకోవచ్చు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. పంచాయతీలు, పరిషత్లను దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం క్లీన్ స్వీప్ చేయాలంటే.. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇప్పించుకోవాల్సిన బాధ్యత అటు ఎమ్మెల్యేలతో పాటు ఇటు ఇన్చార్జ్ మంత్రులపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
10 నియోజకవర్గాల్లో సమన్వయం కరువు
పలు జిల్లాల్లో పాత, కొత్త కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కరువైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రధానంగా కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పోచారం శ్రీనివాస రెడ్డి (బాన్సువాడ), డాక్టర్ సంజయ్ (జగిత్యాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల) ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో శ్రీనివాస్ గౌడ్కు, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్తో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో సరితా తిరుపతయ్యకు, ఖైరతాబాద్లో ఎమ్మెల్యే దానం నాగేందర్తో విజయా రెడ్డికి సమన్వయం లేకుండా పోయింది.
ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న ఆశావహులు
2014 నుంచి కాంగ్రెస్ నేతలకు ఎలాంటి పదవులు లేకుండా పోయాయి. దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలు, కార్యకర్తలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే ఆశావహులంతా టికెట్ల కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా మద్దతు, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంచుకొని వారికి టికెట్లు ఇవ్వడం ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రులకు పెద్ద సవాల్గా మారింది. ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకానికి పీసీసీ ప్రత్యేక పరిశీలకులను నియమించింది. వారి ద్వారా అర్హుల జాబితాను తెప్పించుకున్నది. ఇదే తరహాలో ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రులు ప్రత్యేక సర్వేల ద్వారా అర్హులను గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సీనియారిటీ, సీన్సియారిటీని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తే రెబల్స్ బెడద ఉండదని నేతలు భావిస్తున్నారు.
పీసీసీ చీఫ్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు, తమ అనుచరులకే ప్రయారిటీ ఇస్తున్నారని, పాత కాంగ్రెస్ కేడర్ను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, సీఎం రేవంత్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. వీరి మధ్య సమన్వయం కోసం ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పలుమార్లు మీటింగులు నిర్వహించినప్పటికీ సమన్వయం సాధ్యం కాలేదు. వీరితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లోనూ పార్టీ కేడర్ 2, 3 వర్గాలుగా చీలిపోయి ఉంది. వీరంతా ఆశావహుల లిస్టులను వేర్వేరుగా హైకమాండ్ముందు పెట్టి టికెట్ల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది.