
- పదేళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ మోసం చేయడంతోనే నిర్మాణంలో జాప్యం
మెట్ పల్లి, వెలుగు: కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పదేళ్లు పట్టించుకోలేదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు మండిపడ్డారు. బుధవారం కొండ్రికర్ల గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 6.80 కోట్లు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నర్సింగరావు, కృష్ణారావు ఫొటోలకు గ్రామస్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. కోరుట్ల మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు కొండ్రికర్ల బ్రిడ్జి కట్టకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ్రికర్ల పెద్దావాగుపై బ్రిడ్జి లేకపోవడంతో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గ్రామస్తులఇబ్బందులను గుర్తించి పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మించాలని సంకల్పంతో నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులను కలిసి పలుమార్లు వినతిపత్రం ఇచ్చామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.6.80 కోట్లు నిధులు మంజూరు ప్రజా ప్రభుత్వం చేసిందన్నారు. అంతకుముందు గ్రామస్థులు నర్సింగరావును శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.