
- మీటర్ రీడింగ్ తీసే సమయంలోనే పత్రాల వెరిఫికేషన్
- ఆధార్, రేషన్ కార్డులు మీటర్ నెంబర్తో లింక్
- గృహ వినియోగదారులకే ఉచిత విద్యుత్ వర్తింపు
- ఎన్ని ఇండ్లున్నా.. ఎన్ని మీటర్లున్నా ఒక్కదానికే
- పథకం వర్తింపు జంట నగరాల్లో ఇప్పటికే 50 శాతం సేకరణ పూర్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి జంట నగరాల్లో టీఎస్ఎస్పీడీసీఎల్ మెట్రోజోన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు విధివిధానాలకు సంబంధించి జీవో వెలువడకపోయినా, ఆయా సమావేశాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఓరల్గా ఇస్తున్న ఆదేశాల మేరకు అధికారులు ఉచిత విద్యుత్ హామీ అమలు విషయంలో కసరత్తు చేస్తున్నారు. ముందస్తుగానే పూర్తిస్థాయిలో వినియోగదారుల సమాచారాన్ని సేకరించి రికార్డు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వెంటనే అమలు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఎవరికీ ఇప్పటికీ క్లారిటీ లేదు.
రికార్డులకెక్కుతున్న వివరాలు
జంట నగరాల్లో ఉచిత విద్యుత్పథకం ఎవరికి అమలు చేయాలన్న విషయంపై ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమా చారం. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేస్తారని అనుకుంటున్నారు. మరి రేషన్ కార్డు లేని వారి విషయం పై ఉన్నతాధికారి స్పందిస్తూ ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తుదారులకు రేషన్కార్డులు అందిన తర్వాత ఉచిత విద్యుత్ కోసం వారు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు.
జంట నగరాల్లో 18 లక్షల డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. మరో 4 లక్షలు కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖకు సంబంధించి జంట నగరాల్లోని 9 సర్కిళ్లలో కలిపి దాదాపు 6 లక్షల రేషన్కార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొదటి విడతలో ఆరు లక్షల మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్ అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ మళ్లీ సిటీలో రేషన్ కార్డుల తనిఖీలు నిర్వహించి బోగస్ (అనర్హులకు ఇచ్చినవి) కార్డులను తొలగిస్తే మరింత తక్కువ మందే ఉచిత విద్యుత్కు అర్హత సాధిస్తారు.
ఒక వ్యక్తికి ఎన్ని ఇండ్లు ఉన్నా.. ఒక ఇంటికే పథకం వర్తిస్తుందని, ఇంట్లో ఎన్ని మీటర్లు ఉన్నా ఒక్క మీటర్కే ఉచిత కరెంట్ అందుతుందని అధికారులు వివరించారు. ఇక సిటీలో కమర్షియల్ కనెక్షన్ దారులకు ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. జంటనగరాల్లోనూ అక్రమ విద్యుత్ కనెక్షన్ పై దృష్టి సారిస్తామన్నారు.
ఉచిత విద్యుత్పథకం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు రేషన్కార్డు, ఆధార్కార్డుతో పాటు ప్రజాపాలన సమయంలో ఇచ్చిన రశీదులను తమ వద్ద ఉంచుకోవాలి. విద్యుత్ రీడింగ్ కోసం సిబ్బంది వచ్చినప్పుడు వాటిని చూపించి నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు