న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐకి అప్పగించడంపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఒత్తిళ్లు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రౌత్ అన్నారు. మహారాష్ట్ర సర్కార్పై కుట్ర పన్నుతున్నారని సామ్నా పత్రిక ఎడిటర్ కూడా అయిన రౌత్ మండిపడ్డారు. స్టేట్ మినిస్టర్ను ఈ కేసులో ఇరికించడం ద్వారా కేసును బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు.
‘పలు రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని నిషేధించాయి. శారదా చిట్ ఫండ్ కేసులో జోక్యం చేసుకున్నందుకు సీబీఐకి వ్యతిరేకంగా బెంగాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అంతెందుకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పుడు సీబీఐపై ఇలాంటి అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. గోద్రా అల్లర్ల (గుజరాత్లో 2002లో జరిగింది) కేసు బదిలీని వారు వ్యతిరేకించారు. సుశాంత్ కేసును సెంట్రల్ ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేశాక అలాంటి భావాలే వ్యక్తం చేయడంలో వచ్చిన తప్పేంటి?’ అని రౌత్ పేర్కొన్నారు.