కుల‌, మ‌త, వ‌ర్ణ‌ వివ‌క్ష‌కు చోటు లేదు.. 130 కోట్ల మంది సాధికార‌తే ల‌క్ష్యం: ప్ర‌ధాని మోడీ

కుల‌, మ‌త, వ‌ర్ణ‌ వివ‌క్ష‌కు చోటు లేదు.. 130 కోట్ల మంది సాధికార‌తే ల‌క్ష్యం: ప్ర‌ధాని మోడీ

రాజ్యంగ‌మే భార‌త ప్ర‌భుత్వానికి దారి చూపే వెలుగు రేఖ అని, దేశం కులం, మ‌తం, వ‌ర్ణం, భాష‌, లింగం ఆధారంగా ఎటువంటి వివ‌క్ష‌కు చోటు లేద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం దేశంలోని 130 కోట్ల మంది ప్ర‌జ‌ల సాధికార‌త ల‌క్ష్యంగా ముందుకు న‌డుస్తోంద‌ని తెలిపారు. శనివారం రెవరండ్‌. జోసెఫ్‌ మార్‌ తోమా 90వ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్పరెన్స్‌ ద్వారా మోడీ మాట్లాడారు. కేర‌ళ‌లోని మార్ తోమా చ‌ర్చి సెయింట్ థామ‌స్ భావ‌జాలంతో జీసెస్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తోంద‌ని అన్నారు. ప్ర‌జ‌ల జీవితాల్లో సానుకూల మార్పు కోసం మాన‌వ‌తా దృక్ప‌థంతో ప‌ని చేస్తోంద‌ని, ఆరోగ్యం, విద్య వంటివి అందించ‌డంలో ఎంతో చేసింద‌ని చెప్పారు.జోసెఫ్ మార్ త‌న జీవితం మొత్తాన్ని స‌మాజంం, దేశ‌ అభ్యున్న‌తి కోసం అకింతం చేశార‌ని మోడీ అన్నారు. మ‌హిళా సాధికార‌త‌, పేద‌రికాన్ని పార‌దోల‌డం కోసం ఎంతో చేశార‌న్నారు.

భార‌త ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి ప‌నిని 130 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌ని చేపడుతోంద‌ని, ఇందుకు రాజ్యంగమే మార్గ‌ద‌ర్శ‌క‌మ‌ని అన్నారు ప్ర‌ధాని మోడీ. ఢిల్లీలో ద‌ర్జాగా ఆఫీసుల్లో కూర్చుని నిర్ణ‌యాలు తీసుకోవ‌డం లేద‌ని, క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌ల ఫీడ్‌బ్యాక్ తీసుకున్న త‌ర్వాతే భార‌త‌ ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యానికి వ‌స్తోంద‌ని చెప్పారు. దేశంలో ఎటువంటి వివ‌క్ష‌కు తావు లేకుండా ప్ర‌తి పౌరు‌డూ సాధికార‌త‌తో ముందు సాగాల‌న్న ల‌క్ష్యంతో త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని అన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుతో పేద ప్ర‌జ‌లు ఎక్క‌డున్నా రేష‌న్ స‌రుకులు తీసుకునేలా మార్పులు తెచ్చామ‌న్నారు. జన్ ధన్ యోజ‌న ద్వారా ప్ర‌తి భార‌తీయుడికీ బ్యాంక్ అకౌంట్ ఉండేలా చేశామ‌ని, దీంతో క‌ష్ట స‌మ‌యంలో నేరుగా పేద‌ల‌ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామ‌ని మోడీ తెలిపారు. మధ్యతరగతి ప్రజల ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కోసం అనేక చర్యలు చేపట్టామ‌ని, రైతుల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించామ‌ని అన్నారు.

ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో భార‌త్ చాలా బెట‌ర్‌గా ఉంద‌ని, ప్ర‌జ‌లే ముందుండి వైర‌స్‌పై పోరాటాన్ని న‌డిపిస్తున్నార‌ని మోడీ చెప్పారు. క‌రోనా లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతం చేసి క‌రోనా కంట్రోల్‌లో మంచి విజ‌యాన్ని సాధించామ‌న్నారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు మ‌రింత జాగ‌రూక‌త‌తో ఉండాల‌ని సూచించారాయ‌న‌. వాస్త‌వానికి ముందు క‌న్నా ఇప్పుడే ఎక్క‌వ జాగ్రత్త‌గా ఉండాల‌ని, మాస్కు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం, జ‌నం ఎక్కువ‌గా చేరే ప్రాంతాల‌కు వెళ్ల‌కుండా దూరంగా ఉండ‌డం లాంటివి ఏ మాత్రం మ‌ర్చిపోకూడ‌ద‌ని ప్ర‌ధాని మోడీ చెప్పారు.