సదాశివ నగర్ మండల్ మీటింగ్​లో రసాభాస

సదాశివ నగర్ మండల్ మీటింగ్​లో రసాభాస

కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్​ మండల సర్వసభ్య సమావేశం బుధవారం రసాభాసగా మారింది. ఎంపీపీ అనసూయ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే స్టేజీపై ప్రొటోకాల్​పాటించలేదని ధర్మారావుపేట బీజేపీ ఎంపీటీసీ మహిపాల్​యాదవ్​ ఆఫీసర్లను ప్రశ్నించారు. ఎంపీపీ, జడ్పీటీసీతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్, రైతు బంధు సమితి మండల ప్రెసిడెంట్, జడ్పీ కో ఆప్షన్​మెంబర్​ఎలా కూర్చుంటారని నిలదీశారు. ఎంపీటీసీ కూడా వెళ్లి స్టేజీపై కూర్చున్నారు. కిందకు వెళ్లాలని ఎంపీపీ సూచించగా.. ప్రొటోకాల్​పాటించనప్పుడు తానెందుకు కూర్చోకూడదని ప్రశ్నించారు.

దీంతో ఎంపీటీసీతో ఎంపీపీ, జడ్పీటీసీ వాగ్వివాదానికి దిగారు. పోలీసులు వచ్చి మహిపాల్​ యాదవ్​ను బయటకు వెళ్లాలని చెప్పినా, వినక పోవడంతో ఎంపీపీ అనసూయ  ‘కిందకు దిగి మాట్లాడు.. లేకపోతే ఈడ్చి పడేస్తాం’ అంటూ దూషించారు. తనకు మీటింగ్​గురించి సమాచారం కూడా ఇవ్వలేదని మహిపాల్​యాదవ్​ఎంపీడీవో లక్ష్మిని  ప్రశ్నించగా  పోస్టు ద్వారా పంపానన్నారు. మీటింగ్​లో  వీడియో తీస్తున్న జర్నలిస్టులపై  ఎంపీపీ భర్త రమేశ్​ దురుసుగా వ్యవహరించారు. గొడవ సద్దుమణిగిన కొద్దిసేపటికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  జాజాల సురేందర్​సమావేశానికి వచ్చారు. ఎలాంటి చర్చ జరగకుండానే మీటింగ్​ముగించారు. 

ఎంపీపీ భర్తపై కలెక్టర్​కు ఫిర్యాదు

సదాశివనగర్​ ఎంపీపీ అనసూయ భర్త  రమేశ్​పై  చర్య తీసుకోవాలని కోరుతూ బుధవారం కామారెడ్డి కలెక్టర్​ జితే శ్​వి  పాటిల్​కు  ఎలక్ర్టానిక్ మీడియా ప్రతినిధులు  కంప్లైంట్​చేశారు. మండల పరిషత్​ మీటింగ్​కవరేజీ చేస్తుండగా,  మీడియా ప్రతినిధులను ఎంపీపీ భర్త  అసభ్య పదజాలంతో దూషించారని చర్య తీసుకోవాలని వినతిపత్రం అందించారు.