
రంగారెడ్డి జిల్లా నార్సింగిపోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యాచారం, హత్యా కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2021లో రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషి దినేష్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2017 లో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నాలుగున్నరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు విషయంలో 2021 లో రంగారెడ్డి కోర్టు నిందితుడు దినేష్కుమార్ను దోషిగా పరిగణించిన కోర్టు ఉరిశిక్ష విధించింది. దినేష్ హైకోర్టుకు అప్పీల్ చేసుకోగా... ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు రంగారెడ్డి కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ.. దినేష్ కుమార్ కు ఉరిశిక్ష విధించడం సబబేనని ఈ రోజు ( 2024, జులై 31) న తీర్పు వెల్లడించింది.
కేసు వివరాల్లోకి విళ్తే...
చాక్లెట్ ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన దినేష్ కుమార్ ధార్నే(25)కు ఉరిశిక్ష విధిస్తూ రంగారెడ్డి కోర్టు 2021లో సంచలన తీర్పునిచ్చింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. బాలికపై పాశవికంగా ప్రవర్తించిన నిందితుడికి కఠిన శిక్ష పడాలన్న లక్ష్యంతో పోలీస్ అధికారులు తక్కువ సమయంలో సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో అభియోగ పత్రాలను సమర్పించారు. అసాధారణ ఘటనగా పరిగణించిన కోర్టు వేగంగా విచారణ పూర్తిచేసి నేరస్థుడు దినేష్కు మరణ శిక్షసమంజసమని తీర్పు ఇచ్చింది.
అల్కాపురి టౌన్షిప్లోని ఆర్యమిత్ర కార్మిక శిబిరంలో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేసేవారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన దినేష్ అక్కడే సెంట్రింగ్ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో చనువుగా ఉండేవాడు. 2017.. డిసెంబరు 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి కుమార్తె(5)కు చాక్లెట్ల ఆశ చూపి అపహరించుకుపోయాడు. కార్మిక శిబిరానికి సమీపంలోని నిర్జన ప్రదేశంలోని పూల పొదల వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. పాపకు మెలుకువ వస్తే జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబుతుందనే భయంతో బండరాయితో మోది హత్య చేశాడు. పాప కన్పించడం లేదని తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు పరిసర ప్రాంతాల్లో వెదుకుతుండగా నిందితుడు అమాయకత్వం నటిస్తూ వారిని అనుసరించాడు.
ALSO READ | నార్సింగి అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష
చివరిసారిగా చిన్నారి.. దినేష్ వెంట కనిపించిందనే చిన్న ఆధారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. అతడి దుస్తులకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. లోతుగా విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ జరిగిన ఉదంతాన్ని వెళ్లగక్కాడు. అతడిపై కిడ్నాప్, అత్యాచారం, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నేరస్థుడికి ఉరి శిక్ష విధించాలని అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజిరెడ్డి బలమైన వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు .. నిందితుడు దినేష్కు ఉరిశిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ తుది తీర్పు ఇచ్చారు. దినేష్ కుమార్ హైకోర్టుకు అప్పీలు చేయగా.. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ దోషికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.