
బెంగళూరు: కరోనా వైరస్ ప్రభావం ఇండియన్స్ నిద్రపైనా పడింది. లాక్ డౌన్ కారణంగా ఆఫీసులకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది స్లీప్ టైమింగ్ ఒక్కసారిగా మారిపోయాయని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. బెంగళూరుకు చెందిన మ్యాట్రెస్ల తయారీ సంస్థ వేక్ఫిట్ కరోనా నేపథ్యంలో స్లీప్ ప్యాట్రన్లపై ఇటీవల ఓ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. దాదాపు 1,500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇంట్లోనే ఉండటం.. వర్క్ ఫ్రం హోం చేస్తుండటంతో తాము నిద్రపోయే టైమింగ్సే మారిపోయాయని మెజారిటీ జనం అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మందికిపైగా ఇదే మాట చెప్పారు. లాక్ డౌన్ వల్ల రాత్రి 11 గంటల కంటే ముందు నిద్రపోతున్నామని 46 శాతం మంది చెప్పారు. లాక్ డౌన్కు ముందు ఈ సంఖ్య 39 మాత్రమే. ఇక అర్ధరాత్రి దాటాక నిద్రపోయే వారి సంఖ్య లాక్ డౌన్కు ముందు 25 శాతం ఉంటే.. ఇప్పుడు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నిద్రపోయే వారి సంఖ్య 35కు పెరిగింది. అంటే లేట్ నైట్ తర్వాత నిద్రపోయే వారి సంఖ్య లాక్ డౌన్ వల్ల దాదాపు 40 శాతం పెరగడం విశేషం. ఒకసారి లాక్డౌన్ ఎత్తేస్తే తమ స్లీప్ షెడ్యూల్ మళ్లీ నార్మల్కు వస్తుందని 81 శాతం మందికిపైగా సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు.