న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు లక్షకు దగ్గరవుతున్నాయి. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కానీ, దాంతో పాటే రికవరీలూ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించేదే అయినా, కోలుకుంటున్నోళ్లు పెరగడం కొంచెం ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం దేశంలో 95,649 మంది కరోనా బారిన పడగా, 36,794 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 38 శాతంగా ఉంది. ఆదివారం ఒక్కరోజే 5,000 కేసులు నమోదు కాగా, 2,537 మంది కోలుకున్నారు. 152 మంది చనిపోగా మరణాల సంఖ్య 3,025కి చేరింది. మొత్తంగా 55,823 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఒక్కసారిగా పెరిగిన కేసులు..
ఈ నెల 4వ తేదీ నుంచి ఒక్కరోజు (మే 5) తప్ప ఏ రోజూ 3 వేలకు తక్కువగా కేసులు నమోదు కాలేదు. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజు కేసుల్లో ఇదే ఎక్కువ. అంతకుముందు శనివారం ఎక్కువగా 4,793 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు వారాల్లోనే 52,860 కేసులు నమోదయ్యాయి. అంటే 55 శాతం కేసులు ఈ 14 రోజుల్లోనే రికార్డయ్యాయి. దానికి కారణాలు లేకపోలేదు. గుజరాత్ ప్రభుత్వం గత వారం రోజులుగా అహ్మదాబాద్లో సూపర్ స్ప్రెడర్లను గుర్తించేందుకు ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. 703 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించింది. ఆ ఎఫెక్ట్తోనే ఎన్నడూ లేనిది గుజరాత్లోనూ శనివారం కేసులు వెయ్యి మార్కును దాటాయి. ఇటు తమిళనాడులో కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో కేసులు 10 వేల మార్కును దాటాయి. కోయంబేడు మార్కెట్ఎఫెక్ట్ ఒక్క తమిళనాడులో మాత్రమే కాదు.. పక్కరాష్ట్రాలపైనా పడింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ కావడం, అక్కడి నుంచి ఏపీ వంటి బార్డర్ రాష్ట్రాలకూ బిజినెస్ లింకులుండడంతో కేసులు పెరిగాయి. ఈ రెండు ఘటనల ఫలితంగా ఎక్కువ కేసులు రికార్డవుతున్నాయి. ఇటు, ఢిల్లీ కూడా 10 వేల కేసుల మార్కుకు దగ్గరవుతోంది.
రికవరీలపై డిశ్చార్జ్ గైడ్లైన్స్ ఎఫెక్ట్
కొద్ది రోజుల క్రితం వరకూ కోలుకున్నోళ్ల సంఖ్య 25 నుంచి 30 శాతం వరకు ఉండేది. కానీ, ఇప్పుడది ఏకంగా 38 శాతానికి చేరుకుంది. ఓ వారం రోజులుగా కోలుకుంటున్నోళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. రోజువారీ రికవరీల సంఖ్య 1,500కుపైనే ఉంటోంది. తొలిసారి శుక్రవారం రికవరీలు 2 వేల మార్కును దాటగా, శనివారం దానికి రెట్టింపు సంఖ్యలో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికార్డు స్థాయిలో 4,012 మంది కోలుకున్నారు. దీనికీ కారణం లేకపోలేదు. సీరియస్ లక్షణాలు లేని వాళ్లకు టెస్టులు చేయకుండానే డిశ్చార్జి చేయొచ్చన్న కేంద్ర గైడ్లైన్స్ను అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్తోనే కోలుకుంటున్నోళ్ల సంఖ్య అమాంతం పెరుగుతోంది. అయితే, డిశ్చార్జి చేసినా కొన్ని రోజులు ఇళ్లలోనే ఐసోలేట్ అవ్వాల్సిందిగా ఆ పేషెంట్లకు సూచిస్తున్నారు.