అనంతపురం జిల్లా : ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న దంపతులు.. ఆర్థిక ఇబ్బందులను మాత్రం తట్టుకోలేకపోయారు. ఇద్దరి మధ్యన విబేధాలు రావడంతో సూసైడ్ చేసుకున్నారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
ధర్మవరంలోని, తేరు బజారుకు చెందిన భార్యభర్తలు ఫణిరాజ్ (42), శిరీష (40) శనివారం అర్థరాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇటీవలే ఫణిరాజ్ తల్లి కరోనా బారినపడి మృతి చెందింది. దీంతో ఫణి రాజ్, శిరీష దంపతులు కూడా కరోనా బారిన పడ్డారు. వీరిద్దరూ కొన్ని రోజుల పాటు కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స తీసుకుని, రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. బెల్లం వ్యాపారం నిర్వహిస్తున్న ఫణి రాజ్ గత కొంతకాలంగా వ్యాపారాలు సరిగా జరగక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అని తెలిసింది. ఈ క్రమంలో తండ్రి అనారోగ్యానికి గురి కావడం, వ్యాపారం లేకపోవడం పైగా రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో.. చేసేది లేక భార్యభర్తలిద్దరు ఇంటి పై అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. మృతి చెందిన దంపతులకు ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.