
- సంక్రాంతి తర్వాత పీక్స్..
- ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇంతే
- ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రిక్గా బయటపడుతున్న కేసులు..
- ఇకపై ఊర్లలోనూ పెరగొచ్చు
- నెలా రెండు నెలలు అలర్ట్గా ఉండాలంటున్న ఎక్స్పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. సంక్రాంతి తరువాత పీక్స్కు చేరే అవకాశం ఉంది. అయితే.. మార్చి నాటికి కేసులు దాదాపు మొత్తం ఖతం అవుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కొందరైతే కొత్త వేరియంట్లు రాకపోవచ్చని, ఒక వేళ వచ్చినా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని చెప్తున్నారు. నెల, రెండు నెలలు మాత్రం అలర్ట్గా ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా వేవ్ విస్తరిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ రెండు వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం 2,707, శుక్రవారం 2,398 కేసులు రికార్డయ్యాయి.
గ్రేటర్లో గత పది రోజులుగా వెయ్యికి పైగానే కేసులు వస్తున్నాయి. ఇందులో 90 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించినవేనని డాక్టర్లు అంటున్నారు. హెల్త్ బులెటిన్లో మాత్రం ఈ లెక్కలు చూపడం లేదు. పండుగ సందర్భంగా ప్రయాణాలతో వైరస్ కేసులు పీక్స్కు చేరుతాయని, రానున్న పదిహేను రోజుల్లో భారీగా పాజిటివ్ కేసులు రికార్డవుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగి తర్వాత నెమ్మదిగా తగ్గిపోతుందని చెప్తున్నారు. మార్చి నాటికి కేసులు పూర్తిగా తగ్గిపోతాయని అంటున్నారు.
ఈ నెల చివర్లో భారీగా కేసులు!
గత డిసెంబర్ 31న మన రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 198 కరోనా కేసులుంటే ఇప్పుడు వాటి సంఖ్య రెండున్నర వేలకు చేరుకుంది. వాస్తవానికి ఈ సంఖ్య పది రెట్లకు పైగానే ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య చూస్తే జనవరి 1న 2,500 ఉంటే, ఇప్పుడవి 20 వేలు దాటాయి. రాష్ట్రంలో థర్డ్ వేవ్ మొదలైందని డిసెంబర్ చివర్లోనే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల చివరి నాటికి థర్డ్ వేవ్ పీక్స్కి చేరుతుందని, ఫిబ్రవరి మధ్యలో కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు.
గత డిసెంబర్ 31న మన రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 198 కరోనా కేసులంటే ఇప్పుడు వాటి సంఖ్య రెండున్నర వేలకు చేరుకుంది. వాస్తవానికి ఈ సంఖ్య పది రెట్లకు పైగానే ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య చూస్తే జనవరి 1న 2,500 ఉంటే, ఇప్పుడవి 20 వేలు దాటాయి. రాష్ట్రంలో థర్డ్ వేవ్ మొదలైందని డిసెంబర్ చివర్లోనే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల చివరి నాటికి థర్డ్ వేవ్ పీక్స్కి చేరుతుందని, ఫిబ్రవరి మధ్యలో కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్పారు. మరో పది, పదిహేను రోజుల్లో పీక్స్కి వెళ్లి తర్వాత కేసుల సంఖ్య తగ్గుతుందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు.
నిజామాబాద్ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ కిరణ్ మాదాల కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పీక్స్లో కేసుల సంఖ్య రోజు వారీగా 50 వేలకు పైగానే వెళ్లవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే డాక్టర్ కిరణ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నాటికి పీక్ నమోదై తర్వాత కేసులు తగ్గుతూ వస్తాయని, మార్చి రెండో వారానికి వేవ్ పూర్తిగా తగ్గిపోతుందన్నారు. మన దేశంలోని వివిధ పట్టణాల్లో కరోనా ట్రెండ్ను స్టడీ చేస్తున్న ఐఐటీ ఎక్స్పర్టుల ఆధ్వర్యంలోని సూత్రా కన్సార్షియం ‘‘జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో థర్డ్ వేవ్ పీక్స్ లో ఉంటుంది. రోజు వారీ కేసులు నాలుగు నుంచి ఏడు లక్షల మధ్య నమోదు కావొచ్చు” అని అంచనా వేసింది. ఈ నెల 15–20 మధ్య ఢిల్లీ, ముంబైలో 30 వేల నుంచి 70 వేల వరకు రోజు వారి కేసులు రికార్డవుతాయని చెప్పింది. ఇండియాలోని ట్రెండ్ను స్టడీ చేస్తున్న వాషింగ్టన్ యూనివర్సిటీలోని హెల్త్ మెట్రిక్స్ సైన్స్ చైర్మన్ డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే.. ‘‘ఇండియాలో ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ పీక్స్కు చేరి దేశంలో ఐదు లక్షల రోజువారీ కేసులు నమోదవుతాయి’’ అని అంచనా వేశారు. దీన్ని బట్టి మన రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని హెల్త్ ఆఫీసర్లు భావిస్తున్నారు.
ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇమ్యూనిటీ పెరిగినట్లే..
సాధారణంగా మనిషికి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా దానికి సంబంధించిన సమాచారం శరీరంలోని టీ సెల్స్లో నమోదు అవుతుందని, తర్వాత మళ్లీ ఎప్పుడు అది తిరిగి సోకినా టీ సెల్స్ నుంచి వెళ్లే సమాచారంతో యాంటీ బాడీలు తయారవుతాయని సీసీఎంబీ సైంటిస్టు ఒకరు చెప్పారు. కరోనా వైరస్ ఇప్పటికే చాలా మందికి సోకినందున, దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయం శరీరానికి తెలుసునని, అందుకు తగ్గట్టుగా కొత్త వేరియంట్లు వచ్చినా యాంటీబాడీలు తయారవుతాయన్నారు. మ్యుటేట్ అయిన కొత్త వేరియంట్లు అందుకే ఎక్కువ ప్రభావం చూపడం లేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల శరీరానికి వైరస్ సమాచారం చేరి యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని, అందుకే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు వైరస్ సోకినా స్వల్ప లక్షణాలతో తక్కువ రోజుల్లోనే నార్మల్ అవుతున్నారని చెప్పారు.
భవిష్యత్తులో కొత్త వేరియంట్లు రావని చెప్పలేముగానీ, అవి అంత సీరియస్గా ఉండకపోవచ్చని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. కరోనాతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న వాళ్లంతా వేరే జబ్బులతో బాధపడుతున్న వాళ్లేనని చెప్పారు. హైదరాబాద్లో ఎక్కువ శాతం మందికి కరోనా వచ్చిపోయిందని, లక్షణాలు లేకుండా, స్వల్ప లక్షణాలతో ఉండడం వల్ల టెస్టులకు కూడా వెళ్లడం లేదని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి చెప్పారు. మంత్ ఎండింగ్కి థర్డ్ వేవ్ పీక్స్కి చేరి మార్చిలో క్లోజ్ అవుతుందన్నారు. అయితే ఇది చివరి వేవ్ కాదని, ఈ వేరియంట్తో ఇమ్యూనిటీ వచ్చేస్తుందన్నది కరెక్ట్ కాదని పేర్కొన్నారు.
ఇక ఊర్లలోనూ భారీగా కేసులు
రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్కు హైదరాబాద్ సెంటర్గా ఉందని, ఈ మధ్య సిటీకి వచ్చిపోయిన తర్వాత నేషనల్ లీడర్లు నడ్డా, సీతారాం ఏచూరి లాంటి వాళ్లకు వైరస్ సోకిందని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి అన్నారు. కాబట్టి హైదరాబాద్ నుంచి రాష్ట్రమంతా వైరస్ విస్తరిస్తుందని చెప్పారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి 30 లక్షల మంది సొంతూర్లకు వెళ్లారని ఒక అంచనా. దీంతో వైరస్ ఊర్లలో కూడా వ్యాపిస్తుందని ఎన్ఐఎన్కు చెందిన సైంటిస్ట్ ఒకరు చెప్పారు. అందుకే సంక్రాంతి పండుగ తెల్లారి నుంచి కేసుల నమోదు ఎక్కువవుతుందన్నారు. దగ్గు, సర్ది లక్షణాలున్న వాళ్లలో 70–90 శాతం మంది వైరస్ బారిన పడినట్లేనని చెప్పారు. ఇప్పుడు డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు రెండూ ప్రజల్లో కనిపిస్తున్నాయని, అయితే ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉందంటున్నారు.
కొత్తగా 2,398 కేసులు.. ముగ్గురు మృతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 2,398 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. శుక్రవారం 68,525 మందికి టెస్టులు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్లో 1,233, రంగారెడ్డి జిల్లాలో 192, మేడ్చల్లో 191, మిగిలిన జిల్లాల్లో 783 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,05,199కి పెరిగిందని చెప్పింది. ఇందులో 6,79,471 మంది కోలుకున్నారని, మరో 21,676 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. శుక్రవారం మరో ముగ్గురు చనిపోగా, మృతుల సంఖ్య 4,052కి పెరిగినట్టు వెల్లడించింది.
ఏదో ఒక జబ్బున్నవాళ్లే హాస్పిటల్లో చేరుతున్నరు
ఒమిక్రాన్కు ముందు పరిస్థితులు రావడానికి ఇంకో 3 నెలలు పట్టొచ్చు. మార్చి చివరలో లేదా ఏప్రిల్లో ఇంతకుముందులా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాం. ఇదే ఫైనల్ వేవ్ అని చెప్పలేంగానీ, ఒమిక్రాన్, డెల్టా వంటి సీరియస్ వేరియంట్లు ఇకపై రాకపోవచ్చని అంచనా వేస్తున్నాం. ఇప్పుడు హాస్పిటళ్లలో అడ్మిట్ అవుతున్నవాళ్లంతా ఆల్రెడీ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నవాళ్లే. హెల్దీగా ఉండేవాళ్లు ఎవరూ హాస్పిటళ్లలో చేరేంత సీరియస్గా ఇన్ఫెక్ట్ కావడం లేదు. - డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ హాస్పిటల్.
ఇదే చివరి వేరియంట్ అవుతుందా?
ఒమిక్రాన్తో కరోనా ప్రభావం తగ్గిపోతుందని, ఇదే చివరి వేరియంట్ కావొచ్చని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్ వచ్చి పోవడం కూడా మంచిదేనని చెప్తున్నారు. అయితే.. మరికొందరు మాత్రం వేరియంట్లు రాకపోవడం అనేది ఉండదని అంటున్నారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ..కొత్త వేరియంట్లు రావన్నది సరైంది కాదన్నారు. ఇప్పటికే రకరకాల వేరియంట్లు వచ్చాయని, కొత్తది రాదనే గ్యారంటీ ఏమీ లేదని పేర్కొన్నారు. కాకపోతే దేని ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేయలేమన్నారు. ఇప్పటికే చాలా మందికి వైరస్ వచ్చిపోవడం, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వారిపై కొత్త వేరియంట్ల ప్రభావం అంతగా ఉండడం లేదన్నారు. డీహెచ్ శ్రీనివాసరావు మాత్రం ఒమిక్రాన్తో కరోనా వైరస్ నుంచి విముక్తి అయినట్లేనని, తర్వాత కరోనా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదే చివరి వేరియంట్ కాదు
హైదరాబాద్లో ఇప్పటికే చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇంకో పది నుంచి పదిహేను రోజుల్లో పీక్కు వెళ్లి, అక్కడ్నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. రూరల్ ఏరియాలో పరిస్థితి కొంత డిఫరెంట్గా ఉండొచ్చు. చాలా మందికి వైరస్ మైల్డ్గా వచ్చిపోతుండడం వల్ల, కేసుల సంఖ్య ఎంత అనేది కరెక్ట్గా చెప్పలేం. ఇదే చివరి వేరియంట్ కాదు. ఇంకా కొత్త వేరియంట్లు వస్తాయి. కానీ, అవి ఎంతవరకూ సీరియస్గా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం. - డాక్టర్ రాకేశ్మిశ్రా, సీసీఎంబీ మాజీ డైరెక్టర్
ఈ నెల చివరి కల్లా పీక్
జనవరి చివరికల్లా మన రాష్ట్రంలో థర్డ్ వేవ్ పీక్కు వెళ్తుంది. ఈలోపల చాలా మందికి వైరస్ వచ్చిపోతుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే చాన్స్ ఉంది. ఫిబ్రవరి సెకండ్ వీక్, థర్డ్ వీక్ నాటికి ఈ వేవ్ క్లోజింగ్కు వచ్చే అవకాశం ఉంది. కేసులు పెరుగుతున్నప్పటికీ హాస్పిటలైజేషన్ రేటు మన దగ్గర చాలా తక్కువగా ఉంది. - డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
ఒమిక్రాన్.. డబుల్ స్పీడ్
డెల్టా వేరియంట్ కంటే, డబుల్ స్పీడ్తో ఒమిక్రాన్ స్ప్రెడ్ అవుతున్నది. డెల్టా 118 రోజుల్లో 90 శాతం దేశాలకు విస్తరించింది. ఒమిక్రాన్ 49 రోజుల్లోనే 90 శాతం దేశాలకు పాకింది. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేవ్ రెండున్నర నెలల్లోనే కంప్లీట్ అయింది. ఈ లెక్కన మన దగ్గర ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నాటికి పీక్ నమోదై, ఆ తర్వాత తగ్గొచ్చు. మార్చి ఫస్ట్ లేదా సెకండ్ వీక్ నాటికి కంప్లీట్గా క్లోజ్ కావొచ్చు. - డాక్టర్ కిరణ్ మాదాల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ
పదీ ఇరవై రెట్లు ఎక్కువ కేసులు
ఆల్రెడీ చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. లక్షణాలు లేకపోవడం, ఉన్నా తక్కువగా ఉండడం వల్ల వైరస్ వచ్చిపోయిన విషయం కూడా తెలియట్లేదు. జనం టెస్టింగ్కు కూడా వెళ్లడం లేదు. అందుకే అధికారిక లెక్కల్లో కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నది. బులెటిన్లలో లెక్క కంటే రోజూ పది, ఇరవై రెట్లు ఎక్కువ కేసులు నమోదవుతుండొచ్చు. - డాక్టర్ బుర్రి రంగారెడ్డి, ప్రెసిడెంట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా