
నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణకు నష్టం చేకూరేలా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నల్గొండలోని ముగ్దుం భవన్ సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ వరద జలాలపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వాటాను తేల్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులతోపాటు ఆర్థిక సహకారం అందించే విధంగా చంద్రబాబు పావులు కలుపుతూ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
జలవివాదాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదని హితవు పలికారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ సీపీఐ గ్రామ, మండల మహాసభలు విజయవంతం చేశామన్నారు. జూలై 15న దేవరకొండ పట్టణంలో జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకుడు ఉజ్జిని రత్నాకర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడింగి శ్రావణ్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.