
యాదగిరిగుట్ట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద విధానాలపై సీపీఎం అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గవర్నర్లను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను కేంద్రం ముప్పుతిప్పలు పెడుతూ వేధింపులకు గురిచేస్తోందన్నారు. అలాంటి పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి అనుకూలంగా మాట్లాడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
తాను బీజేపీలో స్కూల్, టీడీపీలో కాలేజ్, కాంగ్రెస్ లో జాబ్ చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అలా మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిప్పుతూ అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు దోషులను తేల్చి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇచ్చినమాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి మూసీనది ప్రక్షాళన చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి పోశెట్టి, పట్టణ కార్యదర్శి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.