సోషల్​ మీడియాలో యాడ్స్​ వల..ఆఫర్స్, లాటరీలు, కూపన్స్ పేరుతో ప్రచారం

సోషల్​ మీడియాలో  యాడ్స్​ వల..ఆఫర్స్, లాటరీలు, కూపన్స్ పేరుతో ప్రచారం
  •  లింక్ ​క్లిక్​ చేస్తే ఫేక్​ వెబ్​ సైట్​లోకి రీడైరెక్ట్​ 
  • వ్యక్తిగత సమాచారం తీసుకుని లక్షలు కొల్లగొడుతున్నరు
  • 20 రోజుల్లో 70  కేసులు నమోదు 

గత వారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 76 ఏండ్ల రిటైర్డ్ ఉద్యోగి ఒక ఫేక్ లాటరీ స్కామ్‌‌‌‌‌‌‌‌లో రూ. 3.18 లక్షలు కోల్పోయాడు. ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో స్క్రోల్ చేస్తుండగా, కేరళ ప్రభుత్వ లాటరీ టికెట్లకు సంబంధించి ఒక యాడ్‌‌‌‌‌‌‌‌ చూశాడు. ఆ లింక్​పై క్లిక్ చేయడంతో ఒక వాట్సాప్ నంబర్‌‌‌‌‌‌‌‌కు రీ డైరెక్ట్ అయ్యాడు. అందులో స్కామర్.. కేరళ ప్రభుత్వం నిర్వహించే గ్రాండ్ లాటరీ ఈవెంట్ గురించి చెప్పి మూడు టికెట్లు కొనమని ఒప్పించాడు. 

కొన్ని రోజుల తర్వాత.. బాధితుడి ఫోన్​కు రెండు మెసేజ్​లు వచ్చాయి. అతడు కొన్న టికెట్లకు రూ. 5 లక్షలు, రూ. 12 లక్షల చొప్పున ప్రైజ్ ​వచ్చిందని నమ్మించారు. దానికి  రిఫండబుల్​ ట్యాక్స్​ రూ. 3.18 లక్షలు కట్టాలని చెప్పి కట్టించుకున్నారు. తర్వాత ఫోన్ ​స్విచ్చాఫ్  రావడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు.  

హైదరాబాద్​సిటీ, వెలుగు:  ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ ఇప్పుడు సైబర్ నేరగాళ్ల టార్గెట్ గా మారింది. రోజూ ఏదో ఒక చోట  ఒక్కో రకమైన సైబర్ ​చీటింగ్​జరుగుతోంది.  జనాలంతా ఎక్కువగా సోషల్ ​మీడియాలోనే గడిపేస్తుండడంతో అక్కడే సైబర్ ​నేరగాళ్లు వల వేసి పట్టుకుని రూ. లక్షల్లో కొల్ల కొట్టేస్తున్నారు. ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్, వాట్సాప్, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌ యాప్​ల్లో లాటరీ ఆఫర్లు, రేటింగ్ రివ్యూలు అంటూ లింకులు పంపించి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఈ తరహా మోసాలు విపరీతంగా పెరిగాయి.  

సైబర్ నేరగాళ్ల ఉచ్చులోకి.. 

సోషల్ ​మీడియాలో ఫేక్ యాడ్స్, లాటరీ ఆఫర్లు, రివ్యూలు, షాపింగ్ ​టోకెన్లు, రేటింగుల పేరుతో  ముందుగా లింక్‌‌‌‌‌‌‌‌లు పంపిస్తున్నారు. వాటిని క్లిక్​ చేసిన వెంటనే బాధితులు నకిలీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లకు రీ డైరెక్ట్ అవుతున్నారు. ఈ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లు అచ్చం ఒరిజినల్ బ్యాంక్, ఈ- కామర్స్, ప్రభుత్వ సైట్ల మాదిరిగానే కనిపిస్తాయి. ఇందులో బాధితుల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను సేకరిస్తారు. గత 20 రోజుల్లో ఇలాంటి సైబర్ మోసాలకు సంబంధించి 70కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా సోషల్ మీడియా ఆధారిత మోసాలు, ఫేక్ లాటరీ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు, రివ్యూ స్కామ్‌‌‌‌‌‌‌‌లే ఉన్నాయి.  

రూ.3.5 కోట్లు రికవరీ.. 

ఇలాంటి కేసుల్లో ఇటీవల సుమారు 54 మంది బాధితులు ఆన్​లైన్​ ద్వారా మోసపోగా, రూ. 3.5 కోట్ల వరకు పోలీసులు రికవరీ చేశారు.  అడ్వాన్సుడ్​ డిజిటల్ ఫోరెన్సిక్​, ఫైనాన్షియల్ ట్రాకింగ్, ఇంటెలిజెన్స్ షేరింగ్ ద్వారా నేరస్తులను గుర్తిస్తున్నారు.  ప్రజల్లో అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌లు చేయడంతో పాటు వీడియోలు పెడుతున్నారు.  

ఖాతా ఖాళీ ఇలా..

  స్కామర్లు ఈ- మెయిల్, సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా భారీ డిస్కౌంట్, ఫ్రీ లాటరీ,  కూపన్ ఆఫర్ వంటి యాడ్స్ ఇస్తారు. ఈ యాడ్స్​ క్లిక్​ చేస్తే  ఫేక్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌కు రీ డైరెక్ట్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ లో బ్రాండెడ్ షాపింగ్ సైట్ లేదా బ్యాంక్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లా కనిపించే నకిలీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లు ఉంటాయి. ఇవి అచ్చం ఒరిజినల్​ సైట్లలాగే  కనిపిస్తాయి. ఇలాంటి లింక్​ సైట్లు బాధితుల ఫోన్లలో మాల్​వేర్ , స్పైవేర్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేస్తాయి. అవి  బ్యాంక్ వివరాలు, పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌లను దొంగిలిస్తాయి. వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి,  బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌లను యాక్సెస్ చేసి దోచుకుంటారు.  
    
సోషల్​ మీడియాలో వచ్చిన ఆఫర్​ యాడ్​ ను నమ్మి క్లిక్​ చేస్తే.. అవి ఫేక్ ​వెబ్​సైట్ కు తీసుకెళ్తుంది. ఆ  ఆఫర్ క్లెయిమ్ చేయడానికి పేరు, ఫోన్ నంబర్, ఈ -మెయిల్, బ్యాంక్ కార్డ్ వివరాలు లేదా ఓటీపీ వంటి సమాచారంతో పాటు కొన్నిసార్లు  ఫీజు చెల్లించమని అడుగుతారు. ఆ వెబ్​ సైట్​లో  వివరాలు ఎంటర్ చేస్తే, స్కామర్లు నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు డ్రా చేస్తారు.
    
లాటరీ పేరుతో వచ్చిన యాడ్స్ ను నమ్మి వివరాలు ఇస్తే ఒక్కోసారి నేరుగా స్కామర్లే  కాల్​ చేస్తారు.  లాటరీ గెలిచారని, క్లయిమ్​ చేసుకోవడానికి కొంత డిపాజిట్​ కట్టాలని నమ్మిస్తారు.  ట్యాక్స్​, ట్రాన్స్​పోర్టేషన్​ ఫీజ్​ చెల్లించమంటారు. దాన్ని నిజమేననుకుని డబ్బులు పంపించాక ఏ స్పందనా ఉండదు. 


అప్రమత్తంగా ఉండాలి. 

  • అనుమానాస్పద లింక్‌‌‌‌‌‌‌‌లను క్లిక్ చేయ కుండా సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్, ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలించండి.     
  • ఓటీపీ, బ్యాంక్ వివరాలు, పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దు.    
  • లాటరీ లేదా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫర్లను అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ల ద్వారానే వెరిఫై చేయండి.    
  •  మోసం జరిగిన వెంటనే 1930కు లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.